కర్నాటకలో మరో అమానుషం చోట చేసుకుంది. ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ గ్రామ ప్రజలు చెరువు మొత్తాన్ని ఖాలీ చేయించడం సంచలనంగా మారింది. ఆమెకు హెచ్ఐవీ సోకిందన్న అనుమానంతో ఆ చెరువు నీళ్లు తాగేందుకు ప్రజలు నిరాకరించారు. దీంతో చేసేదేమి లేక అక్కడి అధికారులు 36 ఎకరాల్లో చెరువును ఖాళీ చేయిస్తున్నారు.
ఉత్తర కర్ణాటకలోని నావల్గంద్ తాలూకాలోని మోరబ్ చెరువులో నవంబర్ 29న ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు హెచ్ఐవీ సోకిందని గ్రామస్తులు అనుమానించారు. గత వారం ఆమె మృతదేహం నీటిపై తేలియాడడంతో గ్రామస్తులు గమనించి.. పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే మృతదేహాన్ని సగం చేపలు తినేశాయి. అయితే ఆమెకు హెచ్ఐవీ ఉండడంతో ఆ చెరువు నీరు కలుషితమైందని.. ఆ నీటిలో హెచ్ఐవీ ఉందని గ్రామస్తులు అంటున్నారు.
ఎయిడ్స్ నీటి ద్వారా వ్యాప్తి చెందదని వైద్య అధికారులు ఎంతో నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. మొదట ఆ నీటిని పరీక్షిస్తామని, అందులో ఎలాంటి హెచ్ఐవీ కారక క్రిములైనా ఉంటే, అప్పుడు నిర్ణయం తీసుకుందామని తెలిపారు. అయినా, మోరబ్ గ్రామస్తులు ససేమిరా అన్నారు.
ఈ సంఘటనపై రాజీవ్ గాంధీ ఛాతీ వైద్యశాలకు చెందిన డాక్టర్ నాగరాజు స్పందించారు. చెరువు నీటిలో హెచ్ఐవీ వైరస్ కలిసిందని నమ్మడంలో నిజం లేదన్నారు. హెచ్ఐవీ వైరస్ ఎనిమిది గంటల కంటే ఎక్కువ బతకలేదని.. ఆ తర్వాత చనిపోతుందన్నారు. మృతదేహాన్ని బయటకు తీసి ఆరు రోజులు అవుతుంది కాబట్టి.. ఆ నీటిలో హెచ్ఐవీ వైరస్ లేదని డాక్టర్ స్పష్టం చేశారు.