కర్నాటక రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. బలనిరూపన చేసుకుంటామని ధీమాగా ఉన్న యోడ్డీ కథ ముగిసింది.కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన పదవికి రాజీనామా ప్రకటించారు. బలపరీక్షకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు తనకు లభించకపోవడంతో ఆయన రాజీనామా చేస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. అనంతరం సభ నుంచి ఆయన బయటకు వెళ్లిపోయారు. ఇక్కడి నుంచి ఆయన నేరుగా రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. గవర్నర్ కు రాజీనామాను సమర్పించనున్నారు.
దీంతో యడ్యూరప్ప సీఎం పదవి మూన్నాల్ల ముచ్చటగానే ముగిసింది. యడ్డీకి అదృష్టం దక్కలేదనే చెప్పుకోవాలి. కేవలం రెండు రోజులకే ఆయన సీఎం పదవి ముగిసింది. బలపరీక్ష కూడా జరగకుండానే, యడ్డీ రాజీనామా చేయడం గమనార్హం. మరోవైపు కాంగ్రెస్, జేడీఎస్ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. తదుపరి ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమారస్వామి పదవీబాధ్యతలను చేపట్టబోతున్నారు.
బలపరీక్ష సందర్భంగా కర్ణాటక అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఓటింగ్ జరుగడానికి ముందే బీజేపీ ఓటమిని అంగీకరించింది. వాయిదా అనంతరం మధ్యాహ్నం 3:30కు ప్రారంభమైన సభలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప బలపరీక్ష తిర్మానంపై ప్రసంగిస్తూ.. మా దగ్గర 104 మంది ఎమ్మెల్యేల మాత్రమే ఉన్నారు కబట్టి బలపరీక్షలో విఫలమయ్యామని చెప్పారు. ఈ సందర్భంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా తాగునీటికి కూడా ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ పర్యటించినట్టు చెప్పారు. గడిచిన ఐదేళ్లలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నట్టు వెల్లడించారు. ప్రజల సమస్యలపై నిరంతర పోరాటం చేశామన్నారు. రైతుల సంక్షేమానికి తన జీవితాన్ని అంకితం చేస్తానని యడ్యూరప్ప అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. తన వూపిరి ఉన్నంత వరకూ రైతుల సంక్షేమానికి జీవితాన్ని అంకితం చేస్తానన్నారు. తమ పార్టీ హయాంలో నీటిపారుదల కోసం రూ.లక్షన్నర కోట్లుకేటాయించినట్టు బావోద్వేగంతో చెప్పారు. ఇక జేడీఎస్, కాంగ్రెస్కు పూర్తిమద్దతు ఉండటంతో జేడీఎస్ నేత కుమార స్వామి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.