టీడీపీ సీనియర్ నేత, ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సోమవారం కన్నుమూశారు. కోడెల తీవ్ర అస్వస్థతకు లోనవడంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన బసవతారకం ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్ పై డాక్టర్లు చికిత్సఅందించారు.అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు.
ఆయన 1947, మే 2న గుంటూరులోని కండ్లకుంట గ్రామంలో జన్మించారు. నరసరావుపేట ప్రాంతంలో తిరుగులేని నేతగా ఆయన ఎదిగారు.ఎన్టీఆర్ పిలుపుతో చిన్న వయసులోనే వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చి, ఎన్నో పదవులను అలంకరించి, వాటికి వన్నె తెచ్చిన వ్యక్తి. ఆయన హఠాన్మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. 1983 నుంచి 2004 వరకూ వరుసగా ఐదుసార్లు నరసరావు పేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోడెల, ఆపై రెండు సార్లు ఓడిపోయి.
2014 లో మరోసారి సత్తెన పల్లినుంచి విజయం సాధించి స్పీకర్ గా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత నవ్యాంధ్రకు తొలి స్పీకర్ గా సేవలందించారు. ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాల్లో మంత్రిగానూ పనిచేశారు.గుంటూరు జిల్లా, నకరికల్లు మండలం కండ్లగుంటలో 1947, మే 2న సంజీవయ్య, లక్ష్మీనర్సమ్మ దంపతులకు జన్మించిన కోడెల, 5వ తరగతి వరకూ స్వగ్రామంలోనే చదివాడు. నరసరావుపేటలో టెన్త్ వరకూ చదివిన ఆయన ఆపై, విజయవాడ లయోలా కళాశాలలో పీయూసీ వరకూ చదివారు.
కర్నూలు వైద్య కళాశాలలో, ఆపై గుంటూరులో ఎంబీబీఎస్, వారణాసిలో ఎంఎస్ చేశారు. నరసరావుపేటలో ఆసుపత్రికి ప్రారంభించారు. ఆయనకు డాక్టర్ గా మంచి పేరు సంపాదించారు.అంచెలంచెలుగా ఎదుగుతున్న కోడెలపై ఎన్టీఆర్ దృష్టి పడింది. ఆయన ఆహ్వానం మేరకు, 1983లో టీడీపీలో చేరిన కోడెల, ఎంతో ఎత్తునకు ఎదిగారు.కోడెల భార్య శశికళ గృహిణి కాగా, వీరికి విజయలక్ష్మి, శివరామకృష్ణ, సత్యన్నారాయణ పిల్లలు.