ఉద్యోగులకు నీరవ్ మోదీ లేఖ
దేశవ్యాప్తంగా నీరవ్ మోదీపైనే రాజకీయాలు జరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటామాట పెరిగి వాగ్యుద్ధ వాతావరణం అలుముకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ రోజుకో విషయం చెబుతున్నాడు. అయితే ఆయన పోయినోడు తన సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి ఎలాంటి హామీ ఇవ్వలేదు. వారి పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఉద్యోగస్తులు ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇప్పుడు వారి పరిస్థితి ప్రశ్నార్థకమైంది. ఆందోళనలో ఉన్న తన కంపెనీ ఉద్యోగస్తులకు నీరవ్ మోదీ ఓ విషయం చెప్పారు. వారికి షాకిచ్చే వార్త చెప్పారు. భారత్లో తన కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా లేఖ పంపించారు. తాను జీతాలు చెల్లించలేనని, వేరే ఉద్యోగాలు చూసుకోవాలని నీరవ్ ఉద్యోగులకు సూచించారు.
దర్యాప్తు సంస్థలు తన కంపెనీల స్టాక్స్ను సీజ్ చేశారని, ఆదాయ పన్ను శాఖ తన బ్యాంకు ఖాతాలన్నీ పనిచేయకుండా చేసిందని, దీంతో తాను ఉద్యోగులకు వేతనాలు చెల్లించే పరిస్థితిలో లేనని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తు గురించి కూడా స్పష్టత లేకపోవడంతో మీరు బయట వేరే ఉద్యోగాలు చూసుకోవాలని చెప్పారు. ఈ పరిస్థితి నుంచి ఎప్పుడు బయటపడతానో తెలియదని, వేరే ఉద్యోగాలు చూసుకోవాలని ఉద్యోగులకు లేఖలో సూచించారు.
తన పాస్పోర్ట్ను రద్దు చేయడంపై నీరవ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, విదేశాంగ శాఖలకు కూడా లేఖలు రాసినట్లు సమాచారం. పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.11,400 కోట్ల కుంభకోణానికి పాల్పడిన కేసులో నీరవ్తో పాటు ఆయన మామ ఛోక్సీపై కూడా సీబీఐ ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నీరవ్కు చెందిన కంపెనీల నుంచి దాదాపు రూ.5,700కోట్ల విలువ చేసే ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. తన బ్రాండ్ను, వ్యాపారాన్ని నాశనం చేసి.. డబ్బు తిరిగి చెల్లించే పరిస్థితి లేకుండా మీరే చేశారని ఆరోపిస్తూ నీరవ్ పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులకు కూడా లేఖ పంపిన విషయం తెలిసిందే.