కర్నూలు జిల్లాలో భారీ వర్షానికి వంకలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఎడత తెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో మహానంది పుణ్యక్షేత్రం జలదిగ్భంధంలో చిక్కుకుంది. దాంతో పాటు సిరివేళ్ళ, రుద్రవరం, ఆళ్లగడ్డ, ఉయ్యాలవాడ, దొరనిపాడు మండలాల్లో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 224 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
మహానందిలోని మూడు కోనేర్లూ నిండిపోయి, నీరు ఎగువకు ప్రవహించి, లోతట్టు ప్రాంతాలను జలమయం చేసింది. వందలాది ఎకరాల్లోని అరటి తోటల్లోకి నీరు ప్రవేశించింది.ఆలయంలో మొదటి, రెండో ప్రాకారంలోకి ప్రవేశించిన వరద నీరు, ఆపై పంచలింగాల మంటపాన్నీ ముంచెత్తగా, ఆలయ అధికారులు దర్శనాలు రద్దు చేశారు. రుద్రగుండం కోనేరులో వరద ఉద్ధృతికి పంచలింగాలూ మునిగిపోయాయి. మరోవైపు పాలేరు వాగు ఉద్ధృతితో నంద్యాల – మహానంది మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.