యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్లో మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం దారుణ హత్యకు గురైన బాలిక శ్రావణి మృతదేహం లభించిన బావిలోనే మరో బాలిక డెడ్బాడిని పోలీసులు గుర్తించడంతో హాజీపూర్ గ్రామస్తులు షాక్ తిన్నారు.ఆ మృతదేహం రెండు నెలల క్రితం అదృశ్యమైన ఇంటర్ బాలిక మనీషదిగా గుర్తించారు.అస్థికలను బావిలోంచి తీయడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.
పదో తరగతి విద్యార్ధిని శ్రావణి స్కూల్ నుండి తిరిగి వస్తూ అదృశ్యమైంది. చివరికి ఆమె మృతదేహన్ని గ్రామానికి సమీపంలోని పాడుబడిన బావిలో కనుగొన్నారు. శ్రావణి హత్య కేసులో హాజీపూర్కు చెందిన పాత నేరస్తుడు శ్రీనివాస్రెడ్డితో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. వీరు ఇచ్చిన సమాచారంతోనే మనీషా హత్య వెలుగు చూసినట్టు తెలుస్తోంది.
మనీషా ఓ యువకుడితో ప్రేమలో పడి ఆతనితో వెళ్లి పోయి ఉంటుందని ఆమె తల్లిదండ్రులు అనుమానించారు. ఈ కారణంగానే మనీషా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.మనీషా నెల రోజులుగా అదృశ్యమైంది. మనీషా ఇంటర్ విద్యార్థిని. నాలుగేళ్ల కాలంలో మూడు హత్యలు చోటు చేసుకొన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ వరుస హత్యలు ఎవరు చేశారనేది ఉత్కంఠంగా మారింది.రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ స్వయంగా హాజీపూర్ చేరుకున్నారు.
కుటుంబసభ్యులు… ఆ బాలిక మృతదేహం బయటపడడంతో గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు, ఎమ్మార్వో, ఆర్డీవో.. ఫైరింజన్ సాయంతో మృతదేహాన్ని వెలికి తీస్తున్నారు. ఓవైపు శ్రావణి.. మరోవైపు మనీష మృతదేహాలు ఓకే బావిలో లభించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.