తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అవ్వడానికి మరికొద్ది గంటలే సమయం ఉంది. దీంతో.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఓటర్లకు డబ్బులు పంచేందుకు నాయకులు నానా తంటాలు పడుతున్నారు.మరో వైపు పోలీసులు కూడా భారీగా నిర్వహిస్తున్న తనిఖీలలో భారీగా నగదు పట్టుబడుతోంది.
యాదాద్రి జిల్లా ఆలేరు చెక్ పోస్టు వద్ద గురువారం ఉదయం 5గంటల సమయంలో రూ.13.3లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళుతున్న టాటా ఏస్ వాహనంలో పోలీసులు తనిఖీలు జరపగా.. నగదు లభించింది.
వరంగల్ జిల్లాలో అధికారుల తనిఖీల్లో భాగంగా రూ.3కోట్లు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. డబ్బుతోపాటు ఓటర్ స్లిప్పులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే సిద్ధార్థ్ నగర్ లోని మరో ఇంటిపైనా పోలీసులు సోదాలు నిర్వహించారు. భారీ స్థాయిలో నగదు లభించింది.
కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణకు చెందిన రూ. 50 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. సర్వే సత్యనారాయణ ప్రధాన అనుచరుడు కాంగ్రెస్ నేత గాలి బాలాజీ వద్ద రూ. 50 లక్షలు, కాంగ్రెస్ ప్రచార సామాగ్రిని టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సర్వే సత్యనారాయణ ఆదేశాల మేరకు బేగంబజార్లోని హవాలా డీలర్ దిలీప్ నుంచి రూ. 50 లక్షలు తీసుకొని గాలి బాలాజీ అనే వ్యక్తి కంటోన్మెంట్కు బయల్దేరాడు. ఏపీ 09 బీఏ 4646 ఇన్నోవా వాహనంలో సర్వే సత్యనారాయణ కోసం బేగంబజార్ నుంచి డబ్బులు తీసుకెళ్తుండగా నాంపల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు.