పుల్వామా ఉగ్రదాడి తర్వాత కేంద్రం తన చర్యలు ప్రారంభించింది. ముందుగా కాశ్మీర్ వేర్పాటు వాదులకు బిగ్ షాక్ ఇచ్చింది. ప్రభుత్వ పరంగా వారికి కల్పిస్తున్న భద్రత , ఇతరత్రా సదుపాయాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. హురియత్ కాన్ఫరెన్స్ చీఫ్ మిర్వాజ్ ఉమర్ ఫరూక్ సహా ఐదుగురు వేర్పాటువాద నేతలకు భద్రతను ఉపసంహరించినట్టు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ సాయంత్రంలోగా వీరంతా ప్రభుత్వ కేటాయించిన వాహనాలు, పోలీసులను అప్పగించాలని స్పష్టం చేసింది.
ప్రభుత్వం కల్పిస్తున్న ఇతర ఏ సౌకర్యాలకూ వారు అర్హులు కాదన్నారు. ఇంకా ఇతర వేర్పాటువాదులెవరైనా ప్రభుత్వ రక్షణ పొందుతున్నట్లయితే దానిపై కూడా పోలీసులు సమీక్షించి వెంటనే చర్యలు తీసుకోనున్నారు. అయితే ఈ జాబితాలో పాక్ అనుకూల వేర్పాటువాద నేత సయ్యద్ అలి షా గిలానీ పేరు లేకపోవడం గమనార్హం. పుల్వామా జిల్లాలో గురువారం సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే.
పుల్వామా ఘటన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం పరిస్థతిని సమీక్షించడానికి శ్రీనగర్లో ఉన్నతాధికారులతో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొంత మంది పాకిస్థాన్, ఐఎస్ఐ నుంచి నిధులు పొందుతున్నారని.. అలాంటి వారికి ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతపై పునరాలోచిస్తామని రాజ్నాథ్ ప్రకటించారు