పుల్వామాపై ఉగ్రదాడిలో 43 మంది సైనికులు మృతి చెందడంతో ప్రస్తుతం ప్రతీకార జ్వాలతో దేశం రగిలిపోతుంది. ఏదో ఒకటి చేస్తే కానీ సగటు భారతీయుడు సంతృప్తి పడేలా లేదు. ఇప్పటికే కేంద్రం కూడా ఈ దిశగానే అడుగులు వేస్తోంది. ఇప్పటికే భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది కేంద్రం.
మోదీ సీరియస్ వార్నింగ్లతో పాకిస్తాన్ అలర్టైంది. ఎల్ఓసీకి దగ్గరలో ఉన్న లాంచ్ప్యాడ్ల నుంచి ఉగ్రవాదులను వెనక్కి పిలిపించింది. సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేసింది. మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే అడ్డుకోకపోతే తమ పరువు పోతుందన్న భావనలో ఉంది పాక్.
కానీ ఇండియా ఈ సారి సర్జికల్ స్ట్రైక్స్ కాకుండా డైరెక్ట్ అటాక్ చేసేందుకు సిద్ధమవుతోంది. అందుకే ఇండియన్ ఎయిర్ఫోర్స్ను రంగంలోకి దించింది. దీనికి తగ్గట్టుగగానే యుద్ధ విన్యాసాల కోసం పాక్ సరిహద్దులకు తరలించిన 140 ఫైటర్ జెట్స్ను అక్కడే ఉంచింది. ఇప్పటికే పొఖ్రాన్లో యుద్ధ విన్యాసాలు నిర్వహించిన వాయుసేన తాము ఎప్పుడు దాడి చేయడానికైనా సిద్ధమేనంటూ ప్రకటించింది. దాడి చేస్తే ఉగ్రవాదులు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయేలా ఉండేలా దాడి ఉండాలన్నది కేంద్రం ఆలోచన. అందుకే ఆచి తూచి అడుగులేస్తున్నారని అధికారులు తెలుపుతున్నారు.
మరోవైపు జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు నిధులిస్తున్న పాకిస్థాన్ని కార్నర్ చేసేందుకు ఉన్న అన్ని ఆప్షన్లనూ ఉపయోగిస్తోంది కేంద్రం. అంతర్జాతీయ సమాజం ముందు పాక్ను దోషిగా నిలబెట్టేందుకు అన్ని ప్రయత్నాలను చేస్తోంది. పాక్ నుంచి దిగుమతి అయ్యే సరుకులకు ఇప్పటికే 200 శాతం పన్నును విధించింది. పుల్వామా దాడికి పాక్కు సంబంధాలు ఉన్నాయనే లింకులను వెతికి పట్టుకుంటుంది. లాంచ్ప్యాడ్లు ఎక్కడ ఉన్నాయో పాక్కు సమాచారమిచ్చి వాటిపై చర్యలు తీసుకోవాలని పాక్ను కోరనుంది. మొత్తానికి పాక్పై సామ, ధాన, భేద, దండోపాయాలు ఉపయోగిస్తూ.. అష్టదిగ్బంధనం చేయాలని చూస్తోంది భారత్.