పుల్వామాలో జవాన్లపై ఆత్మాహుతి ఉగ్రదాడి ఘటనకు తామే బాధ్యులమని పాకిస్థాన్కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈదాడి ఘటనకు వ్యూహరచన చేసింది అంతా పాకిస్థాన్నుంచే అని నిఘా వర్గాలు వెల్లడించాయి. పుల్వామా ఆత్మాహుతి దాడికి పఠాన్కోట్ ఉగ్రదాడి సూత్రధారి, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ సూచనలు ఇచ్చినట్టు గుర్తించారు. పాకిస్థాన్లోని రావల్పిండి ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మసూద్ అక్కడి నుంచే ఈ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.అనారోగ్యం కారణంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల సంఘం యునిటైడ్ జిహాదీ కౌన్సిల్ ఇటీవల నిర్వహించిన ఆరు కీలక సమావేశాలకు అజార్ హాజరుకాలేదు. పుల్వామా దాడికి ఎనిమిది రోజుల ముందే తమ సంస్థ సభ్యులకు మసూద్ ఓ ఆడియో సందేశాన్ని పంపినట్లు తెలుస్తోంది.
గత ఏడాది అక్టోబర్లో తన మేనల్లుడు ఉస్మాన్ను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టిన ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని ఈ ఆడియోలో మసూద్ కోరినట్లు ఉంది. ‘యుద్ధంలో మరణించడం కంటే గొప్ప విషయం ఇంకేది లేదని’ అతను ఆ ఆడియోలో పేర్కొనట్లు ఉంది. ఈ దాడిని యునిటైడ్ జిహాదీ కౌన్సిల్లోని మిగతా ఉగ్రవాద సంస్థలతో పంచుకోని అజార్, దీన్ని రహస్యంగా అమలు చేశాడు.
ఈ ఆడియోల టేపులను ఉపయోగించి కశ్మీర్ లోయలో ఫిదాయీన్ దాడులు(ఆత్మాహుతి దాడులు) చేసే విధంగా యువతను ప్రేరేపించాలని తన మరో మేనల్లుడు మహమ్మద్ ఉమర్, జైషే మాజీ కమాండర్ అబ్దుల్ రషీద్ ఘాజీలకు రహస్య సందేశాలు పంపించినట్లు తెలుస్తోంది. పుల్వామా ఆత్మాహుతి దాడికి పాల్పడిన అబుల్ అహ్మద్ దార్కు రషీద్ ఘాజీనే శిక్షణ ఇచ్చాడు.కశ్మీర్లోని మొత్తం 60 మంది జైషే మహ్మద్ ఉగ్రవాదుల్లో 35 మంది పాక్ పౌరులు కాగా, మిగతా వాళ్లు స్థానిక యువతే ఉన్నారని ఐబీ వర్గాలు వెల్లడించినట్లు సమాచారం.