రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో మోదీ సర్కారుకి భారీ ఊరట లభించింది. రాఫెల్ ఒప్పందానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది… పారద్శకంగానే భారత ప్రభుత్వం, ఫ్రాన్స్ మధ్య ఒప్పందం జరిగిందని వ్యాఖ్యానించింది. ఫ్రాన్స్ తో డీల్ తో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి ఏ విధమైన సహేతుక కారణాలూ కనిపించడం లేదని న్యాయమూర్తి రంజన్ గొగొయ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఒప్పందం, ధర నిర్ణయం విషయంలో తాము సంతృప్తిగానే ఉన్నామని కోర్టు తెలిపింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో అన్ని విషయాలు బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. రాఫెల్ డీల్లో అవకతవకలు జరిగాయంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ల మీద సీజేఐ రంజన్ గొగోయ్ ఇవాళ తీర్పు వెలువరించారు.
రాఫెల్ డీల్ వివరాలను సీక్రెట్గా ఉంచడం వల్ల నష్టం లేదని, దేశ భద్రత దృష్ట్యా ఆ వివరాలను రహస్యంగా ఉంచొచ్చని అభిప్రాయపడింది. రాఫెల్ డీల్ను రహస్యంగా ఉంచడం వెనుక సందేహాలను లేవనెత్తుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ ఒప్పందంపై విచారణ జరపాలని కొందరు కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, మరో ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్తో కూడిన ధర్మాసనం గతంలో విచారణ జరిపింది. దీనిపై తీర్పును ఇవాళ వెలువరించింది.
మరోవైపు రాఫెల్ డీల్పై గత కొంతకాలంగా కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. పార్లమెంటు సమావేశాల్లోనూ దీనిపై రగడ కొనసాగుతోంది. సుప్రీం తీర్పుతో రాఫెల్ ఢీల్పై విపక్షాలు చేస్తున్న విమర్శల్లో నిజం లేదని తేలిందని.. ఇకనైనా వారు ఆరోపణలు మానుకోవాలని బీజేపీ సూచించింది.