రైతులకు ఇచ్చిన మాటను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు… రైతులకు రూ.12,500 ఇచ్చే రైతు భరోసా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అక్టోబర్ 15న ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. టీడీపీ హయాంలో ఉన్న అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దు చేసి రైతు భరోసా పథకాన్ని తీసుకొస్తున్నారు.
మొదటి విడతగా ఒక్కో రైతు కుటుంబానికీ రూ.2,500 ఇస్తామని ప్రకటించారు. రైతులకు కనీస మద్దతు ధర సంపూర్ణంగా అందేలా, తగు న్యాయం జరిగిలా అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రూ.3000 కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధిని బడ్జెట్లో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు వ్యవసాయం, అనుబంధ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మరో వైపు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
మరో వైపు నకిలీ విత్తనాలు సరఫరా చేసె సంస్థలపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు జగన్ సూచించారు. అక్రమాలు జరిగితే జైలుకు పంపడానికి కూడా వెనకాడొద్దని స్ట్రైట్గా చెప్పారు.వ్యవసాయ రంగంలో అక్రమాల్ని అడ్డుకోవడానికి విత్తన చట్టం తేవాలని అధికారులు సూచించగా… అవసరమైతే అసెంబ్లీలో చర్చించి చట్టం తెద్దామని సీఎం జగన్ తెలిపారు. గ్రామ సచివాలయాల ద్వారా విత్తనాలు, ఎరువులు, మందులను పంపినీ చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలన్న సీఎం… ఉత్తమమైన సలహాలు ఇస్తే చాలా సంతోషిస్తానన్నారు. అలాంటి వారికి సన్మానం చేస్తామని ప్రకటించారు.