రాజస్థాన్ భాజాపా అభ్యర్తి, మంత్రి అయిన జస్వంత్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అక్కడ సంచలనంగా మారాయి. త్వరలో రాజస్థాన్లోని అల్వార్ లోక్సభకు త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. ఎన్నికల పోటీలో నిలిచిన బీజేపీ అభ్యర్థి, మంత్రి జస్వంత్ యాదవ్ దుఘేడా గ్రామంలో ప్రచారంలో పాల్గొంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఓటర్లు హిందువైతే తనకు, ముస్లింలు అయితే కాంగ్రెస్కు ఓటు వేయాలని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. కాగా, ఈ వీడియో గురించి తెలుసుకున్న బీజేపీ నేతలు అది కాంగ్రెస్ చేసిన కుట్ర అని అంటున్నారు. తమ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమకు లభిస్తున్న ఆదరణను చూసి కాంగ్రెస్ ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని అంటున్నారు.
మేము మీరు చేసిన అభివృద్ధి పనులను చూసి ఓటు వేశాం కానీ మీరు హిందూవని, భాజపా హిందూ పార్టీ అని వేయలేదని ప్రజలు ఆయనకు సమాధానం’ తెలుపుతున్నట్లు కూడా ఆ వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. మేవాత్ ప్రాంతంలో తనకు లభిస్తున్న ఆదరణను చూసి కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని మంత్రి ఆరోపించారు. భాజపా నాయకులు ఎన్నికల్లో కులాలు, మతాలను అడ్డుపెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు జిల్లా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దాంతో పాటు మంత్రి మాట్లాడిన వీడియోలను కూడా అందించారు.