జగన్ ఒకటి అనుకుంటే మరొకటి అవుతోంది. ఏపీ మద్యపాన నిషేధానికి సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. పల్లెల్లో బెల్ట్ షాపులను ముందుగా తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే జగన్ మద్యాన్ని కంట్రోల్ చేయాలని చూస్తుంటే ఏపీలో మాత్రం ఆ మద్యం అమ్మకాలు పెరగడం గమనార్హం. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరగడంతో ఇప్పుడు ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో తెలియక వైసీపీ సర్కారు తర్జన భర్జన పడుతున్నట్టు సమాచారం.
ఏపీలో పూర్తిగా మధ్య నిషేధాన్ని నాలుగేళ్లలో దశల వారీగా చేయాలని జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు. అమలుకు శ్రీకారం చుట్టారు. ఏపీ ప్రజలను మద్యానికి దూరం చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అదే సమయంలో కోల్పోయే ఆదాయాన్ని సమపార్జించడం ఎలా అనే దానిపై కసరత్తు చేస్తున్నారు.
అయితే తాజాగా ఏపీలో మద్యం అమ్మకాలు జూలై మాసంతో రూ.1670 కోట్లకు పెరగడం విశేషం. జూలై 2018లో ఇదే సమయంలో 1453 కోట్లు ఆదాయం మాత్రమే వచ్చింది. అంటే సంవత్సరంలోనే ఏకంగా 14.93శాతం ఆదాయం పెరగడం విశేషం.
తెలంగాణ, ఇతర రాష్ట్రాలు మద్యం అమ్మకాలతో రికార్డ్ ఆదాయాన్ని కొల్లగొడుతున్నాయి. కానీ జగన్ మాత్రం మద్యపాన నిషేధానికి మొగ్గు చూపుతుండడంతో ఏపీ భారీగా ఆదాయాన్ని కోల్పోనుంది. అందుకే ఇప్పుడు నిషేధంతో ఏపీకి భారీ నష్టమేనన్న అంచనాలు నెలకొంటున్నాయి.