రంజాన్ సెలవులకు స్వగ్రామం వచ్చిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో అతి కిరాతకంగా నరికి చంపారు. 20 రోజుల్లో పెళ్లిపీటలెక్కాల్సిన కొడుకును కోల్పోవడంతో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కడప జిల్లా రైల్వే కోడూరు బస్టాండ్ సమీపంలో ఈరోజు తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెల్తే… రైల్వేకోడూరు రంగనాయకులపేటకు చెందిన సాబ్జాన్ కుమారుడు షేక్అబ్దుల్ఖాదర్ (26) బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతడికి ఇటీవలే వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో ఈనెల 23న తన మేనమామ కూతురితో పెళ్లి జరగాల్సి ఉంది. రంజాన్ పండుగ కావడంతో సొంతూరుకు వచ్చేందుకు బస్సులో బయలు దేరారు.
తెల్లవారు జామున రైల్వేకోడూరు బస్టాప్ లో బస్సు దిగి నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. శ్రీకృష్ణ సినిమా హాల్ వద్దకు వచ్చేసరికి దుండగులు కత్తులతో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతామని పేర్కొన్నారు. కాగా చేతికి అందివచ్చిన కొడుకు హత్యకు గురికావడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండటంతో ఇరు కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది.