ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పుట్టిన రోజునాడు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో తల్లి, దండ్రులపై పెట్రోల్ పోసి, నిప్పు పెట్టిన సంఘటన స్థానికంగా సంచలనం అయ్యింది. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం మార్కాపురం ఆస్పత్రికి తరలించారు. తండ్రి పరిస్థితి విషయమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రకాశం జిల్లా మార్కాపురం ఎస్సీ కాలనీకి చెందిన గాలయ్య, లక్ష్మీ దంపతులకు ప్రసాద్ అనే కుమారుడు ఉన్నాడు. గురువారం తన పుట్టినరోజు కావడంతో పార్టీకి డబ్బులు ఇవ్వాలని ప్రసాద్ గురువారం (మే16, 2019)న తల్లిదండ్రులను ఒత్తిడి చేశాడు. అయితే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగోలేదని, డబ్బులు లేవని చెప్పారు గాలయ్య, లక్ష్మీ. గాలయ్య తల్లి అంకమ్మ కూడా మనవడికి ఆర్థిక పరిస్థితి గురించి అర్థమయ్యేలా నచ్చచెప్పడానికి ప్రయత్నించింది. ఎంత చెప్పినా వినకపోవడంతో తనతో పాటె తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిమీద పోసుకని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.
పిల్లాడి ప్రవర్తనతో ఆవేశానికి లోనైన తల్లిదండ్రులు… ప్రసాద్ చేతిలో బాటిల్ తీసుకుని ‘మేమే చచ్చిపోతాం…’ అంటూ పెట్రోల్ మీద పోసుకున్నారు. తల్లిదండ్రుల చర్యను ఆపాల్సిందిపోయి.. ‘చచ్చిపోండి’ అంటూ అగ్గిపుల్ల గీసి తల్లిదండ్రులపై విసిరేశాడు ప్రసాద్. అనంతరం ఇంటి నుంచి పరారయ్యాడు పుత్రరత్నం.
మంటలు అంటుకుని గాలయ్య, లక్ష్మీ, నాయనమ్మ అంకమ్మ కేకలు పెడుతుంటే స్థానికులు వచ్చి వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. తండ్రి గాలయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసును నమోదు చేసుకున్న పోలీసులు పారిపోయిన ప్రసాద్ కోసం గాలిస్తున్నారు.