భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఖాతాలో మరో విజయం చేరింది. ఉదయం 5.30కి PSLV-C46 రాకెట్ ద్వారా… రీశాట్-2బీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపి… కక్ష్యలో ప్రవేశపెట్టింది. 615 కిలోల బరువున్న రాడార్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ‘రీశాట్ -2బీఆర్1’ను 557 కిలోమీటర్ల ఎత్తులో నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది.
నెల్లూరు జిల్లాలోని షార్ కేంద్రం నుంచి తెల్లవారు జామున 5.30 గంటలకు సీఎస్ఎల్వీ-సీ46 రాకెట్ విజయవంతంగా దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా ఇస్రో… 48వ PSLV రాకెట్ను ఉపయోగించింది. ఇందుకోసం ప్రత్యేకంగా బూస్టర్లు లేకుండా అంతరిక్షంలోకి వెళ్లే కోర్ అలోన్ (PSLV-CA) రాకెట్ను ఎంచుకుంది.
44.4 మీటర్ల ఎత్తున్న పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగ సమయంలో 290 టన్నుల బరువుతో ప్రయాణం ప్రారంభమైంది. 139 టన్నుల ఘన ఇంధనంతో 1.50 నిమిషాలకు పూర్తి చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. 41 టన్నుల ద్రవ ఇంధనంతో 4.22 నిమిషాలకు రెండోదశ, 7.65 టన్నుల ఘన ఇంధనంతో 9.23 నిమిషాలకు మూడోదశ, 1.6 టన్నుల ద్రవ ఇంధనంతో 14.42 నిమిషాలకు నాలుగోదశ పూర్తి చేసిన అనంతరం 15.29 నిమిషాలకు 615 బరువు కలిగిన రిశాట్–2బీఆర్1 ఉపగ్రహాన్ని భూమికి 557 కిలోమీటర్ల ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్లో 37 డిగ్రీల అక్షాంశంలో ప్రవేశపెట్టింది.
ఈ ఉపగ్రహం అయిదేళ్ల పాటు అంతరిక్షంలో ఉండి సేవలు అందిస్తుంది. రీశాట్ 2 బీఆర్1 ఉపగ్రహం సరిహద్దుల్లో ఉగ్రశిబిరాలు, కదలికలను పసిగట్టనుంది. అలాగే ప్రకృతి వైపరిత్యాలపై అధ్యయనం చేస్తుంది. ఇక భారతీయులు గర్వంగా చెప్పుకునే చంద్రయాన్-2కి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. జూలై 9 నుంచి 16లోపు చంద్రయాన్-2 ప్రయోగం ఉంటుందని ఇస్రో చైర్మన్ శివన్ తిరుమలలో తెలిపారు. ఈ ప్రయోగం కోసం అందరూ ఎదురుచూస్తున్నారన్న ఆయన… సెప్టెంబరు 6న చంద్రుడిపై చంద్రయాన్-2 రోవర్ దిగుతుందని వివరించారు.