బీజేపీ సీనియర్ నాయకుడు.. కాబోయే హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ ఇంట్లో ఒక పదునైన కత్తి బయటపడడం కలకలం రేపింది. దత్తాత్రేయను కలవడానికి వచ్చిన కార్యకర్తల తోపులాటలో ఈ కత్తి బయటపడడంతో కార్యకర్తలు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
అసలు ఇలా పదునైన కత్తిని ఎవరు తీసుకొచ్చారు? ఎందుకు తీసుకొచ్చారు? దత్తాత్రేయ ప్రాణాలకు ముప్పు ఉందా అన్న కోణంలో పోలీసులు ఆరాతీస్తున్నారు. దీంతో దత్తాత్రేయను ఇంటి తెలంగాణ పోలీసులు ఆధీనంలోకి తీసుకొని కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు.
దత్తాత్రేయ నిన్న ఫిజియో థెరపీ చేయించుకొని హైదరాబాద్ రాంనగర్ లో ఉన్న ఆయన ఇంటికి వచ్చారు. కాగా గవర్నర్ గా వెళ్లిపోతున్న దత్తాత్రేయను అభినందించడానికి ఎంతో మంది నేతలు, కార్యకర్తలు అభిమానులు బొకేలతో వచ్చారు. ఆయన అందరినీ కలుస్తూ ఫొటోలు దిగుతున్నారు. ఈ క్రమంలో కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఆ తోపులాటలో పదునైన చిన్న కత్తి బయటపడడం కలకలం రేపింది.
వెంటనే గుర్తించిన కార్యకర్తలు దత్తాత్రేయ వ్యక్తిగత సిబ్బందికి చెప్పారు. వారు పోలీసులకు చెప్పడంతో దీనిపై పోలీసులు ఆరాతీస్తున్నారు. సీసీ ఫుటేజీ చెక్ చేస్తున్నారు. దత్తాత్రేయ ఇంటికి కత్తి తీసుకొని వచ్చింది ఎవరనే దానిపై ఆరాతీస్తున్నారు. కాగా కత్తి బయటపడడంతో దత్తాత్రేయకు గట్టి భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. సామాన్యులు,కార్యకర్తలను కలిసేందుకు అనుమతించడం లేదు.