తెలుగు దేవం పార్టీకి కడప జిల్లాలో షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య నిన్న రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. బుధవారం తెల్లవారు జామున ఆయనకు గుండెపోటు రావడంతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచారు.
హైదరాబాద్ శివార్లలోని ఓ ఆసుపత్రికి బ్రహ్మయ్యను తరలించగా, అప్పటికే ఆయన కన్నుమూసినట్టు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు . బ్రహ్మయ్య మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.
ఫిబ్రవరిలో కూడా గుండెపోటు రావడంతో విజయవాడలోని రమేష్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందారు. చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు. కడప జిల్లాకు చెందిన బ్రహ్మయ్య కొంతకాలంగా రాజకీయంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఇటీవల ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ సీటును ఆయన ఆశించి భంగ పడ్డారు.
1994 ఎన్నికల్లో తొలిసారిగా రాజంపేట నుంచి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999 ఎన్నికల్లోనూ రెండోసారి గెలిచి, చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు. 2004 ఎన్నికల్లో మూడోసారి పోటీచేసి ఓటమి చవిచూశారు.