ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి కోల్పోయిన ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎల్వీని ఇటీవలే సీఎం జగన్ సీఎస్ పదవి నుంచి తప్పించి మానవ వనరుల అభివృద్ధి డీజీగా నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఎల్వీ సుబ్రహ్మణ్యం స్థానంలో కొత్త సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం రెండు రోజుల క్రితమే నిర్ణయించింది. తాజాగా ఏపీ సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ కు ఎల్వీ బాధ్యతలు అప్పజెప్పారు.
అయితే ఎల్వీ తనకు కేటాయించిన మానవ వనరుల అభివృద్ధి ఇన్ స్టిట్యూట్ డీజీగా బాధ్యతలను స్వీకరించకుండానే సెలవుపై వెళ్లడం అధికార వర్గాల్లో కలకలం రేపింది. ఈనెల 6వ తేదీ నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు ఎల్వీ సుబ్రహ్మణ్యం సెలవుపై వెళ్లారు.
ఇటీవల ఏపీ సీఎం జగన్ కార్యాలయ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తో వివాదం కారణంగా ఎల్వీ సుబ్రహ్మణ్యం పదవి ఊడిపోయింది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 6న బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల సమయంలో సుబ్రహ్మణ్యాన్ని నియమిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి సీఎంగా జగన్ గద్దెనెక్కాక కూడా ఎల్వీనే కొనసాగారు.
1983 బ్యాచ్ కు చెందిన ఎల్వీసుబ్రహ్మణ్యం పదవీ కాలం వచ్చే ఏడాది 2020 ఏప్రిల్ 30వ తేదీ వరకు ఉంది. మరో ఐదు నెలల్లో ముగుస్తుందనగా ఆయన సీఎస్ గా దిగిపోయారు. ఇప్పుడు సెలవులో వెళ్లిపోయారు.