తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఎంసెట్ ర్యాంకులను సచివాలయంలో ప్రకటించారు. ఇంజినీరింగ్లో 78.24 శాతం, అగ్రికల్చర్, ఫార్మసీలో 90.72 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,36,305మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1,06,646మంది పాసయ్యారు.
మే 25 నుంచి ఇంజినీరింగ్ తొలి విడత కౌన్సిలింగ్ ప్రారంభం అవుతుందని కడియం శ్రీహరి తెలిపారు. అలాగే జులై మొదటి వారంలో రెండో విడత కౌన్సిలింగ్ ఉంటుందని, జులై 16 నుంచి ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభం అవుతాయన్నారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో ఇంటర్నల్స్ స్లైడింగ్ విధానం ద్వారా ఒక కోర్సు నుంచి మరో కోర్సుకు విద్యార్థులు మారవచ్చని తెలిపారు.
ఎంసెట్ మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీతో ర్యాంకులను ప్రకటించారు. 94,592 మందికి మాత్రమే ఎంసెట్ ర్యాంకులను కేటాయిస్తున్నట్లు కడియం చెప్పారు. మిగతా విద్యార్థులు ఇంటర్ ఫెయిలవడం, సీబీఎస్ఈ ఫలితాల కోసం ఎదురు చూస్తుండటమే దీనికి కారణమన్నారు.
జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో మే 2 నుంచి 7 వరకు ఎంసెట్ ఎగ్జామ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. తొలిసారిగా కంప్యూటర్ బేస్డ్గా తెలంగాణ ఎంసెట్ పరీక్షలను నిర్వహించగా.. 1,36,311 మంది విద్యార్థులు హాజరయ్యారు.