ఇప్పటికే ఏపీ ప్రజల డేటా అక్రమంగా ఒక ప్రైవేటు కంపెనీకి అడ్డగోలుగా అప్పజెప్పిన కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్లు మరో అతి తెలివి పని చేసి అడ్డంగా దొరికిపోయారు. ఐటీ గ్రిడ్స్ అనే కంపెనీ దగ్గర ఆంధ్ర ప్రదేశ్ ప్రజల వ్యక్తిగత వివరాలతో సహా డేటా అంతా దొరకడం, సదరు డేటాను తెలుగుదేశం పార్టీ ఆంధ్రలో ఓటరు లిస్టులను ప్రభావితం చేసేందుకు ఉపయోగిస్తుందనే ఆరోపణ రావడంతో ఉలిక్కిపడ్డారు అంతా. వెంటనే నష్ట నివారణ నివారణ చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగానే నిన్న ట్విట్టర్లో #TSGovtStealsData అనే హ్యాష్ ట్యాగును ట్రెండ్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ఈ ప్లాన్ కూడా విఫలమైంది.
ఎందుకంటే ఈ హ్యాష్ట్యాగ్తో ట్వీట్లు చేసేవారంతా ఏపీకి గానీ, తెలంగాణకు గానీ చెందిన వారు కాదు. ఇందులో అనేక హ్యాండిల్స్ ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల వారు చేసినవి. ఇందులో తెలుగులో ట్వీట్లు చేసిన వారేవరికి కూడా తెలుగు సరిగా రాదనేది కాదనలేని వాస్తవం.
కొంచెం లోతుగా తవ్వి చూస్తే ఈ భాగోతం వెనుక టీడీపీ ఉందని తెలుస్తోంది. ఈ హ్యాష్ట్యాగ్ను కృత్రిమంగా ట్రెండ్ చేయడానికి ఒక ఏజెన్సీకి భారీ ఎత్తున డబ్బు ముట్టజెప్పిందని తెలుస్తోంది. డబ్బు అందగానే వారు డబ్బు తిసుకొని ట్వీట్లు చేసే వారిని ఎంగేజ్ చేసుకొని ఈ తతంగాన్ని నడిపించినట్టు సమాచారం.
ట్వీట్ చేసిన వారిలో ముంబైకు చెందిన రియా అనే ఒక మోడల్, సంతోష్ షుక్లా అనే ఓ యాక్టరు.. ఇలా అనేక మంది ఈ డేటా చోరి గురించి చంద్రబాబుకు మద్ధతుగా ట్వీట్ చేశారు. కొంచెం గమనించి చూస్తే ఈ ట్విట్టర్ అకౌంట్లు అన్నిటిలో ఒకే విధమైన ట్వీట్లు ఉండటం గమ్మత్తుగా అనిపిస్తోంది. ఒక తప్పుడు పనిని కప్పిపుచ్చుకోవడానికి ఉల్టా తెలంగాణ ప్రభుత్వం మీద ఎదురుదాడికి ప్రయత్నించిన చంద్రబాబు, లోకేశ్ ఇప్పుడు ఈ క్యాష్ ఫర్ ట్వీట్ స్కాములో మరోసారి బుక్కయ్యారు.