వైఎస్ జగన్.. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. అంతేకాదు..పార్టీ కోసం పాటుపడి తనతోపాటు ఉన్న వారందరికీ న్యాయం చేసేందుకు సాహస నిర్ణయాలు తీసుకుంటున్నారు. తనకు సన్నిహితుడైన ఒక ఎమ్మెల్యేకు కీలక పదవి ఇప్పించేందుకు ఏకంగా కేబినెట్ మీటింగ్లో చట్టాన్ని కూడా మార్చేసి సంచలనం సృష్టించారు. ఇప్పుడీ వ్యవహారం ఏపీ ఎమ్మెల్యేల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ జగన్ మెచ్చిన ఆ ఎమ్మెల్యే ఎవరో తెలుసా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.
టీటీడీ పాలకమండలిలో తిరుమల కొలువై ఉన్న తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (తుడా) చైర్మన్ కు ఎక్స్ ఆఫిషియో సభ్యుడిగా నియమించాలనే ప్రతిపాదన నాటి వైఎస్ హయాం నుంచి నిన్నటి చంద్రబాబు హయాం వరకు ఉంది. అయితే 2016లో చంద్రబాబు ఈ జీవోను రద్దు చేశారు. అంతకుముందు వైఎస్, రోశయ్య, కిరణ్ హయంలో తుడా చైర్మన్ టీటీడీలో ఎక్స్ ఆఫిషియో సభ్యుడిగా ఉన్నారు.
చంద్రబాబు 2016లో రద్దు చేసిన జీవోను ఇప్పుడు వైఎస్ జగన్ పట్టుబట్టి జీవోను తాజా కేబినెట్ భేటిలో చట్టసవరణ చేసి మళ్లీ ఆమోదించారు. దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కీలకమైన టీటీడీలో కీలక పదవి దక్కబోతోంది.
తుడా చైర్మన్ గా ప్రస్తుతం చెవిరెడ్డి ఉన్నారు. జగన్ తాజాగా సవరించిన జీవో ప్రకారం టీటీడీలో చెవిరెడ్డికి సభ్యుడిగా అవకాశం దక్కుతుంది. ఇలా తన సన్నిహితుడైన చెవిరెడ్డి కోసం ఏకంగా కేబినెట్ లో చట్టసవరణకు జగన్ సిద్ధపడడం చర్చనీయాంశంగా మారింది.