ఐక్యరాజ్యసమితికి భారీ షాక్ ఇచ్చింది పెద్దన్న దేశం. మాతో పెట్టుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయో ఐరాసాకు రుచిచూపించారు ట్రంప్. రూసలెంను ఇజ్రాయల్ రాజధానిగా ప్రకటిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయం ఐక్యరాజ్యసమితిలో వీగిపోయిన సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలన్నీ ఐక్యరాజ్యసమితి వేదికగా అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకించాయి.
జెరూసలేం నిర్ణయంపై వ్యతిరేకంగా ఓటేసిన దేశాలకు విడుదల చేసే నిధులపై కోత పెడతామంటూ హెచ్చరికలు జారీ చేసిన అమెరికా.. మొదటి షాక్ ఐక్యరాజ్య సమితికే ఇచ్చింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ కీలక ప్రకటన ఒకటి చేశారు.
ఐక్యరాజ్య సమితి కార్యకలాపాల కోసం 2018-19 మధ్యకాలంలో కేటాయించే నిధుల్లో 285 మిలియన్ డాలర్ల కోత పెట్టినట్లు ఆమె పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశంలో ప్రపంచదేశాలన్నీ అమెరికాను ఒంటరి చేశాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. దీంతో ఐరాసాతోపాటు ప్రపంచ దేశాలన్నీ షాక్కు గురయ్యాయి. అయితే సమితికి కేటాయించే మొత్తం బడ్జెట్ నిధులను నిలిపేస్తున్నారా? లేక సమితి నిర్వహణ కోసం అందించే ఉదార నిధులును అమెరికా రద్దు చేసిందా అన్న విషయంపై స్పష్టత రావాల్సివుంది.
జెరూసలేం నగరాన్ని ఇజ్రాయెల్ రాజధానిగా అధికారికంగా గుర్తిస్తున్నామని, అమెరికన్ ఎంబసీని జెరూసలేంకు మార్చుతున్నామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్దిరోజులు క్రితం ప్రకటించారు. ముస్లిం దేశాల్లో అల్లర్లు, ఆందోళనలు చెలరేగాయి. దీంతో అమెరికా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ పప్రపంచదేశాలన్నీ సమితిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. దీనికి 128 దేశాల మద్దతుల లభించింది. చిర్రెత్తుకొచ్చిన అమెరికా వ్యతిరేకంగా నిలిచిన అన్నీ దేశాలను గుర్తుపెట్టుకుంటాం’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఇది అంతర్జాతీయంగా ఎలాంటి పరినామాలకు దారి తీస్తుందో చూడాలి.