ఎన్నికల వేల వైఎస్ వివేకానందరెడ్డి హత్య ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ముందుగా గుండెపోటుతో మరణించారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఒంటిపై గాయాలుండటంతో వివేకా పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పోస్ట్ మార్టంలో హత్యేనని తేలడంతో కేసును నిగ్గు తేల్చేందుకు సీఐడీ చీఫ్ అమిత్ గార్గ్ నేతృత్వంలో ప్రత్యేక విచారణ బృందాలు పనిచేస్తున్నాయి.
వివేకా హత్యోదంతంలో క్లూస్ టీమ్ ఆయన గదిలో కొన్ని వేలిముద్రలు, పాదముద్రలు సేకరించినట్టు కడప ఎస్పీ రాహుల్ తెలిపారు. తాము సంఘటన స్థలాన్ని పరిశీలించిన సమయంలో ఇంటి వెనుక తలుపు తెరిచే ఉందని అన్నారు. వెనుక తలుపు నుంచి ఎవరైనా ప్రవేశించే అవకాశం ఉందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. రాత్రి పదకొండున్నర గంటల నుండి ఉదయం ఐదు గంటలలోపు ఏం జరిగిందనే విషయమై ఆరా తీస్తున్నామని ఎస్పీ తెలిపారు.