మిర్యాలగూడలో ప్రణయ్ హత్యపై దేశమంతా ఉలిక్కిపడింది. చంపిన అమృత తండ్రి మారుతీరావును ఉరి తియ్యాలి.. రాళ్లతో కొట్టి చంపేయాలంటూ.. అందరూ ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ప్రణయ్ హత్య జరిగి వారం రోజుల తిరగక్క ముందే.. హైదరాబాద్లో మాధవిపై తండ్రి మనోహరాచారి కొబ్బరి కాయల కత్తితో కూతురిపై దాడి చేశాడు. దీనిపైనా అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ.. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే.. రెండో వైపు మరో కోణం ఉంది. మారుతీరావు, మనోహరాచారిపై వ్యతిరేకత ఎంత ఉందో.. వీరిని సమర్థిస్తున్న వారూ అంతే ఉన్నారు. సోషల్ మీడియాలో.. వీరికి సైతం వత్తాసు పలుకుతూ.. కామెంట్లు, వీడియోలను పెడుతున్నారు. వారు చెప్పే కోణం వేరేలా ఉంది. ఈ కామెంట్లపై మారుతీరావు కుమార్తె, ప్రణయ్ భార్య అమృత సైతం స్పందించి.. బాధపడిన విషయం తెలిసిందే. తన తండ్రి చేసిన దారుణాన్ని మద్దతిస్తూ.. కామెంట్లు పెడుతన్న వారందరూ అతని లాంటివారేనంటూ అమృత బాధపడింది. కానీ.. అమృత అన్న మాటలపైనా.. తీవ్రస్థాయిలో ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు అంతటికీ కారణం నువ్వు కాదా.. నీ వల్లే ఇలా జరిగిందంటూ.. ఆమెపైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. మనోహరాచారి విషయంలోనూ ఇలాగే.. మద్దతిచ్చే వాళ్లు కొందరు.. తిట్టేవాళ్లు కొందరుంటున్నారు. మరికొందరైతే ఒకడుగు ముందుకేసి.. అసలు ఇదంతా ఓ కుటుంబం మధ్య జరిగిన వివాదం దీనిని ఎందుకు సమాజానికి రుద్దుతున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఓ తండ్రి, కుమార్తెకు మధ్య సెటిల్ అవ్వాల్సిన విషయం.. సమాజానికి పాకితే ఎలా ఉంటుందో ఈ రెండు సంఘటనలు ప్రత్యక్ష నిదర్శనాలు. మారుతీరావు తన కుమార్తెను కాలు కిందపెట్టకుండా పూల పాన్పులపై పెంచుకున్నాడు. 20 ఏళ్లు పెంచుకున్న కుమార్తెను.. ముక్కుముఖం తెలియని ఓ కుర్రాడొచ్చి తీసుకెళ్లిపోయి.. తన ఊరిలోనే తన కళ్లెదుటే తిరుగుతూ.. తనతో పూర్తిగా సంబంధాలను తెంపేశాడన్న కసి.. కోపంతో మారుతీరావు రగిలిపోయాడు. అతనిలో కక్ష ఎంతుందో.. బాధా అంతే ఉంది. అందుకే.. తన కూతురిపై బాధను.. ప్రణయ్పై కక్షగా మార్చుకుని నిర్దాక్షిణ్యంగా చంపించాడు. అందుకే.. దేశమంతా గగ్గోలు పెట్టినా.. ఘోరం దారుణమంటూ.. ఘోషించినా.. మారుతీరావు ముఖంలో ఏమాత్రం తాను తప్పు చేశానన్న భావన కనీసం ఒక్క శాతం కూడా కనిపించలేదు.
పోలీసులు తీసుకొచ్చి మీడియా ముందు పెట్టినప్పుడు కూడా అతనిలో బాధ.. పశ్చాతాపం కనిపించలేదు. కారణం.. తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినోడిని తాను ఇబ్బంది పెట్టానంతే.. అనే భావన తప్ప మారుతీరావులో ఇంకే భావనా లేదు. కానీ.. అదే సమయంలో ప్రణయ్ తల్లిదండ్రులది ఏమిచ్చినా తీర్చలేని బాధ. కన్న కొడుకును అత్యంత పాశవికంగా కడతేర్చారు. ప్రణయ్.. అమృతను చూడకపోయినా.. ప్రేమించకపోయినా.. పెళ్లాడకపోయినా.. హాయిగా తమ కళ్ల ముందు స్వేచ్ఛగా బతికేవాడు. ఇంతలా కక్ష కట్టి ఎవరూ వెంటాడి చంపేవారు కాదు. మరోవైపు అభం శుభం తెలియని వయసులోనే ఏర్పడిన ప్రేమతో అమృత ప్రణయ్తోనే తన బతుకనుకుంది. కానీ.. అదీ మధ్యలోనే తెగిపోయిందిప్పుడు. ప్రస్తుతం కొందరు చెబుతున్నట్టు ఇది కేవలం ఆ రెండు కుటుంబాలకు సంబంధించిన సంఘటన మాత్రమే. కానీ.. ఇప్పుడు ఇదో సామాజిక రుగ్మతగా.. సమాజంపై రుద్దేయాలని కొందరు ప్రయత్నం చేస్తుండడం బాధాకరం. ప్రస్తుతం కులాల అడ్డుగోడలు తెగిపోయాయి.
నూటికో.. కోటికో.. ఒకటి రెండు సంఘటనలు జరుగుతున్నాయంతే. కానీ.. కులాంతర వివాహాలు చేసుకున్ని హాయిగా కలిసిపోయిన కుటుంబాలు ఎన్ని లేవు. మరి వాళ్లందరినీ వదిలేసి.. ఈ ఒకటి రెండు సంఘటనల ఆధారంగానే సమాజాన్ని చూడడం ఎంతవరకూ సమంజసం. ఇక్కడ కులం కారణం కాదు.. ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న ఆర్థిక తారతమ్యాలే కారణం. మనోహరాచారి విషయంలోనూ ఇదే జరిగింది. కానీ.. ఇప్పుడు ఆ రెండు కుటుంబాల మధ్య విషయాన్ని తెచ్చి అదో సామాజిక రుగ్మతగా రుద్దేస్తున్నారు. ఇదో సామాజిక రుగ్మత.. కుల వివాదమైతే.. చంపినోళ్లకు ఎందుకు మద్దతు పలికేవాళ్లుంటారు. ఏదేమైనా ఈ రెండు సంఘటనల ఆధారంగా యువత తమ పంథా విషయంలో పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తమకు నచ్చినట్టు, తాము అనుకున్నట్టు చేసుకుంటూ వెళ్లిపోతే.. దాని వల్ల ఇబ్బంది పడేవాళ్లతో వచ్చే ఇబ్బందులనూ గుర్తిస్తే.. ఇలాంటి సంఘటనలు జరిగేందుకు ఆస్కారం ఉండదు.