విద్యా వ్యాపారమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత.. నాణ్యత ప్రమాణాలు లేకపోవడంతో తల్లిదండ్రులంతా ప్రైవేటు పాఠశాలల బాటపట్టారు. స్కూల్లన్నీ మూత పడిపోతున్నాయి. తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు లేక వెలవెలబోతున్నాయి.
మరోవైపు కూలీ పనులు చేసుకునే వారు సైతం తమ పిల్లలను ప్రైవేటు బడులకు పంపిస్తూ గొప్పగా చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ విద్య పతనమవుతున్న వేళ ఏపీ సీఎం జగన్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మారుస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభుత్వ పాఠశాలలకే పంపేలా చేస్తోంది. దీనికంతటికి కారణం ఒకటే అదే ‘అమ్మ ఒడి’.
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలన్నీ ఇప్పుడు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. ఉపాధ్యాయులు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల ముందు అడ్మిషన్లు ఫుల్ అని బోర్డ్ పెట్టేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏపీలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ‘అమ్మఒడి’ పథకాన్ని ప్రవేశపెట్టారు. పాఠశాలల్లో తమ పిల్లలను చేర్చిన తల్లులందరికీ రూ.15వేల ఆర్థిక సాయాన్ని ఈ పథకం ద్వారా జగన్ అందజేస్తానని ప్రకటించడంతో ఈ తాకిడి ఎక్కువైంది.
ఈ పథకం ద్వారా బడికి వెళ్లని చిన్నపిల్లలను కాళ్లు చేతులు పట్టుకొని మరీ ఎత్తుకెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు వేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు సైతం తమ పిల్లలను మాన్పించేసి ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తుండడం గమనార్హం. ఇలా జగన్ పెట్టిన పథకానికి ఒక్క దెబ్బతో ప్రభుత్వ పాఠశాలల గతియే మారిపోవడం గమనార్హం. తరతరలాలుగా క్షీణిస్తున్న ప్రభుత్వ పాఠశాలలను జగన్ ఒక్క పథకంతో పూర్వపు తీసుకురావడం విశేషంగా చెప్పవచ్చు.