పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులో అవినీతి జరిగిందని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనె ప్రాజెక్టుపై విచారణ జరపిస్తామని అవసరం అయితే టెండర్ను క్యాన్సిల్ చేసి రీటెండర్ పిలుస్తామని చెప్పిన జగన్ అదే నిర్ణయం తీసుకోబోతున్నారు.
పోలవరం ఏపీ ప్రజల జీవనాడి. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏపీ సుభిక్షంగా ఉంటుందని జనం నమ్ముతున్నారు. గత ప్రభుత్వ హయాంలోనె ప్రాజెక్టును పూర్తిచేస్తామని చెప్పిన బాబు ఆ దిశగా అడుగులు వేయలేపోయారు. కేంద్రంతో సఖ్యత లేకపోవడంతో ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి.
పోలవరం టెండర్లలో భారీ అవినీతి చోటుచేసుకుందని ఆరోపించిన జగన్.. తాను అధికారంలోకి రాగానే ఆ అవినీతి గుట్టు తేల్చేపనిలో పడ్డారు. అవసరం అయితే రీటెండర్లు పిలుస్తామని గతంలోనె ప్రకటించారు. ఇప్పుడు జగన్ తాను అన్నంత పని చేస్తున్నారు. ప్రస్తుత కాంట్రాక్టర్ ట్రాన్స్ట్రాయ్తో ఒప్పందాన్ని రద్దు చేసి కొత్తగా టెండర్లను పిలవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.
పోలవరంను సందర్శించిన జగన్ ప్రాజెక్టు తీరుపై ఓ కమిటీని వేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ నివేదికను ప్రభుత్వానికి త్వరలో అందించనుంది. ప్రధాన కాంట్రాక్టర్ తో ఒప్పందం రద్దయితే ఇక సబ్ కాంట్రాక్టర్లకు అవకాశం ఉండదని, అందువల్ల మొత్తం అన్ని పనులకు కొత్తగా టెండర్లు పిలవాల్సిందేనని ఆ కమిటీ సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది.
గత 5ఏళ్ల టీడీపీ ప్రభుత్వ కాలంలో తీసుకున్న నిర్ణయాలను, ఉత్తర్వులను శల్య పరీక్ష చేసిన తర్వాతే ఈ కమిటీ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అదే విధంగా జగన్ పోలవరంను త్వరగా పూర్తి చేయాలనె లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.