ఏపీలో జరిగిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధిస్తుందని మెజారిటీ సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. జాతిమీడియా సంస్థలు, లగడపాటి సర్వేలు మాత్రమే టీడీపీ గెలుస్తుందని అంచనా వేసినప్పటికి….గెలుపుపై మాత్రం వైఎస్ జగన్తో పాటు పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. ఈనెల 23న ఫలితాలు వెలువడిని వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 24 న తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరిగింది.
ముహూర్తం బాగుండటంతో జగన్ ఆ రోజు ప్రమాణస్వీకారం చేయడానికి నిర్ణయించుకున్నాడనే వార్తలు వినిపించాయి. అయితే అనూహ్యంగా తన ప్రమాణస్వీకారోత్సవం ముహూర్తంపై జగన్ మనసు మారిందని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వారం తర్వాత అంటే మే 30న ప్రమాణస్వీకారం చేయాలని వైసీపీ అధినేత నిర్ణయించుకున్నాడని సమాచారం.
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సూచనల మేరకే జగన్ తన ప్రమాణస్వీకారోత్సవ ముహూర్తాన్ని మార్చుకున్నారని తెలుస్తోంది. కొంతకాలంగా ఇలాంటి అంశాల్లో ఎక్కువగా స్వరూపానంద సూచనలు పాటిస్తున్న సంగతి తెలిసిందే. ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా స్వరూపానందేంద్ర స్వామి సూచనలమేరకే నడుకుంటున్నారు. ఇప్పుడు కూడ ప్రమాణస్వీకారోత్సవ ముహూర్తం విషయంలోనూ ఆయన సలహానే పాటించారని… అందుకే ముందుగా అనుకున్న ముహూర్తాన్ని కాదని కొద్ది రోజులు వెయిట్ చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.