వైఎస్ జగన్ మోహన్రెడ్డి పులివేందులలో నామినేషన్ వేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మధ్యాహ్నం 1.49 నిమిషాలకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ వేసే ముందు సర్వమత ప్రార్థనలు చేశారు జగన్. జగన్ వెంట కుటుంబసభ్యులు, సీనియర్ నేతలు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. వేలాది మంది నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలిరావడంతో పులివెందుల జనసంద్రమైంది. అనంతరం స్థానిక సీఎస్ఐ చర్చి మైదానంలో జరిగిన బహిరంగసభలో బాబు, పవన్లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
వైఎస్ వివేకానందరెడ్డిని టీడీపీ వాళ్లే హత్యచేశారని వైఎస్ జగన్ ఆరోపించిన జగన్…పులివెందుల, జమ్మలమడుగులో వైసీపీ ఓటర్లను భయపెట్టేందుకే బాబాయ్ని దారుణంగా చంపారని విమర్శించారు. ఓట్లను చీల్చేందుకే జగనసేన పార్టీని బాబు రంగంలోకి దింపారన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాకు ప్రొడ్యూసర్, స్క్రిప్ట్ రైటర్, డబ్బులు పంపిణీ అంతా చంద్రబాబేనని వ్యాఖ్యానించారు.
జనసేన, టీడీపీల మధ్య అవగాహన ఒప్పందం ఉందన్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను మెుదట చంద్రబాబు నాయుడు తన పార్టీలోకి తీసుకోవాలని భావించారని ఆయనను భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యించాలని కూడా చూశారని జగన్ స్పష్టం చేశారు. అయితే అక్కడ ప్రజలనుంచి తీవ్ర వ్యతిరేకత రానుండటంతో తన పార్టనర్ పార్టీ జనసేనలోకి పంపించారన్నారు. లక్ష్మీనారాయణకు విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా సీటు కూడా ఇప్పించారన్నారు. రాబోయే రోజుల్లో కోట్లు కుమ్మరించి ఓట్లను కొనేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తారని జగన్ విమర్శించారు. టీడీపీ డబ్బులకు వైసీపీ నవరత్నాలే పోటీకావాలన్నారు.