రాష్ట్ర విభజన తర్వాత రెండో సారి జరిగిన ఎన్నికల్లో వైసీపీ 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ సీట్లు గెలుచుకొని ఘనవిజయం సాధించింది. రేపు గురువారం మధ్యాహ్నం నవ్యాంధ్ర రెండో సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జగన్ ఒక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారని …. వచ్చేనెల 7న పూర్తి మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.
మంత్రివర్గం ఆమోదంతోనే శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. శాసన సభ సమావేశాలు 11,12 తేదీల్లో జరగనున్నట్లు సమాచారం. శుక్ర, శనివారాల్లో సచివాలయానికి వెళ్లనున్న జగన్, ఆ తర్వాత శాఖల వారీగా సమీక్షలు జరిపి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందన్నదానిపై ఓ అవగాహనకు రానున్నారు.
దీనికి సంబంధించి మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి బుధవారం సచివాలయంలో ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. సచివాలయం మొదటి బ్లాక్లో సీఎం ఛాంబర్, క్యాబినెట్ సమావేశ మందిరం, సీఎం కాన్వాయ్ రూట్తో పాటు సీఎం నేమ్ ప్లేట్ను పరిశీలించారు.
గురువారం ప్రమాణస్వీకారం చేసిన వెంటనే జగన్ ప్రధాని మోదీ ప్రమాణస్వీకారానికి ఢిల్లీ వెల్లనున్నారు.ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత శనివారం నుంచే సచివాలయంలో కొత్త సీఎంగా జగన్ అడుగుపెడుతారు. ఇప్పటికే సచివాలయంలో అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం ఛాంబర్, కేబినెట్ హాల్, హెలిపాడ్, సీఎం కాన్వాయ్ రూట్లను ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. జగన్ నేమ్ ప్లేట్ను కూడా దగ్గరుండి పరిశీలంచారు.