మోహన్ బాబు ఫ్యామిలీ, టీడీపీ ప్రభుత్వం మధ్య ఫీజురీయంబర్స్ మెంట్ వివాదం ముదరి పాకాన పడుతోంది. బకాయిలను వెంటనే విడుదల చేయాలని మోహన్బాబు తిరుపతిలో నిరసన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. మంచు ఫ్యామిలి చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ ప్రణాలికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బకాయిల విషయంలో మోహన్బాబు రాజకీయాలు చేస్తున్నారంటూ కుటుంబరావు చేసిన వ్యాఖ్యలకు మంచు మనోజ్ , విష్ణు ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు.
అయితే తాజాగా మోహన్ బాబు చంద్రబాబుపై పరోక్షంగా ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. చంద్రబాబు పేరును ప్రస్తావించకుండానే తీవ్ర పదజాలంతో కలెక్షన్ కింగ్ విరుచుకుపడ్డారు. తనని రెచ్చగొడితే అన్నయ్య.. దివంగత ఎన్టీఆర్కు చేసిన మోసాలు, జరిగిన ఘోరాలను బయటపెడ్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని నటుడు మోహన్బాబు హెచ్చరించారు.
తన కుటుంబంపై చంద్రబాబు కక్షసాధింపు చర్యలు మొదలుపెట్టారని ఆయన ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల గురించి అడిగితే చెప్పే ధైర్యం లేక జోకర్ల చేత మాట్లాడిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు లాంటి గ్రేట్ అబద్ధాల కోరు గురించి చెప్పాలంటే ఒక గ్రంథం తయారవుతుందని అందులో పేర్కొన్నారు.
2013లో అతడు అధికారంలో లేకపోయినా ఎంతో గౌరవించి నా ఫంక్షన్స్, సినిమా ఓపెనింగ్స్ ఎన్ని జరిగాయో అన్నింటిలోనూ ఉన్నాడు.. కావాలంటే ఇంటర్నెట్లో చూసుకోండి అంటూ లేఖలో మండిపడ్డారు. అధికారంలో లేకపోయినా ఎంతో గౌరవించి ప్రతి కార్యక్రమానికీ ఆహ్వానించాను.. కానీ నామీద నా కుటుంబం మీద కక్షసాధింపు చర్య చేపట్టాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.