ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం ఇపుడు చినబాబును.. అదే నారా లోకేష్ను ఇబ్బందుల్లోకి నెట్టేలా ఉంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ ఆశిస్తున్న ఎమ్మెల్సీలు.. తమ పదువులకు రాజీనామా చేయాలని చంద్రబాబు ఆదేశించినట్టు సమాచారం. ఇప్పటికే జమ్మలమడుగు అసెంబ్లీ టికెట్ ఖరారు కాగానే… మంత్రి ఆదినారాయణ రెడ్డి వర్గంతో కుదిరిన ఒప్పందం మేరకు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను మండలి చైర్మన్ కూడా ఆమోదించారు.
ఇప్పటికే మూడు సార్లు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన సోమిరెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నారా లోకేష్ పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
డైరెక్ట్గా ఎన్నికల్లో దిగితే గెలిచే సత్తా లేనందునే దొడ్డిదారిన చట్టసభల్లోకి లోకేశ్ కు ఎంట్రీ ఇచ్చిన చంద్రబాబు…. ఇప్పుడు లోకేశ్ కు ప్రత్యక్ష బరిని అనివార్యంగా మార్చేశారని కూడా చెప్పక తప్పదు. మరి టీడీపీ ప్రజా వ్యతిరేకతను భారీగానే మూటగట్టుకున్న నేపథ్యంలో లోకేశ్ ప్రత్యక్ష బరిలోకి దిగి విజయం సాధిస్తారా? అన్న ప్రశ్న టీడీపీ నేతల మనసుల్లో పీకుతుంది.
అందుకే పోటీ చేస్తే సునాయాసంగా గెలిచే నియోజకవర్గాల వేటలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే లోకేష్ ఓ సేఫ్ జోన్ను కూడా ఖరారు చేసుకున్నారన్న వాదన వినిపిస్తోంది. చినబాబు కుప్పం లేదా పెనమలూరు నుంచి పోటీ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది.
అసలు మిగిలిన ఎమ్మెల్సీల సూత్రాన్ని చంద్రబాబు లోకేష్కు వర్తింజేస్తారా? లేదా వేచి చూడాల్సిందే. ఏదేమైనా లోకేష్ టీడీపీ నేతలను నయానో.. భయానో.. తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు. మరి ప్రజలు ఎలా ఆదరిస్తారో చూడాలి.