త్వరలో జరిగే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని విశ్వప్రయత్నాలు బాబు ఒక వైపు చేస్తుంటే…మరో వైపు ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడుతూ షాక్ ఇస్తున్నారు. వైసీపీ కండువా కప్పుకున్న టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ బాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీకీ చెందిన ఒక టీడీపీ అవినీతిపై పీఎమ్ఓకు ఫిర్యాదు వెల్లిందని …స్వయంగా ప్రధానే జోక్యం చేసుకోవడంతోనే బాబు, మోదీకి మధ్య విభేదాలు ప్రారంభం అయ్యాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబు అవినీతి, బంధుప్రీతి కారణంగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు కేంద్రం ఇవ్వలేదన్నారు.
ప్రత్యేకహోదా పేరుతో నాటకాలు ఆడుతున్నారని మరో సారి భాజాపా అధికారంలోకి రాదనే కాంగ్రెస్తో జత కట్టారని ఆరోపించారు. ఆనాడు వైసీపీ తో పాటే మేముకూడా రాజీనామా చేసుంటే ప్రయోజనం ఉండేదన్నారు. మనం కూడా రాజీనామా చేద్దామని చెప్తే చంద్రబాబు అస్సలు వినలేదు. కులాల మధ్య చిచ్చు పెట్టింది చంద్రబాబేనని సంచలన ఆరోపనలు చేశారు.
చంద్రబాబు నాయుడు మూడుసార్లు సీఎంగా చేశాను కనుక తాను చెప్పిందే ప్రజలు వినాలనుకుంటే కుదరదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒక అవకాశం జగన్ కు కూడా ప్రజలు ఇవ్వాలని, ఆయన అధికారంలోకొస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ప్రత్యేక హోదాపై జగన్ మొదటినుంచి ఒకే మాటకు కట్టుబడి ఉన్నారని బాబు మాత్రం యూటర్న్లు తీసుకున్నారన్నారు.
అవినీతి, బంధుప్రీతి రాష్ట్రంలో రాజ్యమేలుతున్నాయని అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని, మేమేం చేసినా ప్రజలు అడగరనే ధీమాలో చంద్రబాబు ఉన్నారని శ్రీనివాస్ ఆరోపించారు.ఆయనకు నచ్చిన విధంగా చేస్తే మంచివాళ్లు లేకుంటే చెడ్డవాళ్లగా ముద్రకొట్టడం అలవాటేనని మండిపడ్డారు. భీమిలి అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వలేదని పార్టీ మారడం లేదని తేల్చి చెప్పిన అవంతి శ్రీనివాస్ పార్టీ విధానాలు నచ్చకనే వైసీపీలో చేరానని వివరించారు. జగన్ నాయకత్వాన్ని బలపర్చాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలందరికీ ఉందని విజ్ఞప్తి చేశారు.