మాజీ ఆర్థిక మంత్రి, వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తాజాగా వైఎస్ జగన్ సర్కారుపై చేసిన విమర్శలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా అణుచుకున్న ఆగ్రహాన్ని కావాలనే బయటపెట్టారన్న చర్చ ఇప్పుడు నెల్లూరు జిల్లాలో సాగుతోందట.. తన రాజకీయ అనుభవం అంత లేని నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేకు మంత్రి పదవులు ఇచ్చి తనను పక్కనపెట్టడాన్ని ఆయన జీర్ణించుకోకనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న టాక్ వినిపిస్తోంది.
వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ పై ఆనం రాంనారాయణ రెడ్డి చేసిన విమర్శలను వైసీపీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది.ఆనం వ్యాఖ్యలు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నాయని సీఎం జగన్ తోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సీరియస్ అయ్యారు. వెంటనే ఆనంకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పార్టీ నుంచి ఎందుకు సస్సెండ్ చేయకూడదో చెప్పాలని ఆనంను వివరణ కోరారు. ఆనం వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
నిజానికి సీఎం జగన్ గద్దెనెక్కాక నెల్లూరు జిల్లా నుంచి అందరికంటే సీనియర్, వైఎస్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన ఆనంకు మంత్రి పదవి ఖాయం అనుకున్నారు. కానీ జగన్ నెల్లూరు జిల్లా నుంచి ఫైర్ బ్రాండ్ అయిన అనిల్ కుమార్ యాదవ్ ను మంత్రిని చేశారు. అప్పటి నుంచే పార్టీలో మౌనంగా ఉంటూ రగిలిపోతున్న ఆనం ఇప్పుడు బయటపడ్డారు. పార్టీ, ప్రభుత్వం తనను నిర్లక్ష్యం చేయడంపై కలతచెందిన ఆనం.. అదే సమయంలో తనకంటే జూనియర్లు అయిన మంత్రి అనిల్, మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల ఆధిపత్యాన్ని నెల్లూరు జిల్లాలో తట్టుకోలేకపోయారు. అందుకే వైసీపీ నుంచి బయటకు వచ్చేందుకే ఆనం వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు.