టీడీపీ విజయం మీద నమ్మకం లేదనో లేకా బాబు మీద నమ్మకం లేకనో కొందరు నేతలు ఎన్నికల్లో పోటీ చేయకుండానే పలాయనం చిత్తగిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల్లో టికెట్లు దొరక్క తంటాలు పడుతుంటె దర్జాగా టీడీపీలో టికెట్లు దక్కించుకున్న నేతలు మాత్రం పోటీ చేయాలంటేనే భయపడుతున్నారు. నామినేషన్లు దాఖలు చేసిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థులు చేతులు ఎత్తేస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నామినేషన్ వేయకుండానే కొందరు నేతలు చేతులెత్తేస్తే తాజాగా నామినేషన్ వేసిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీకి ఒక అభ్యర్థి ఝలక్ ఇచ్చారు.
వైఎస్సార్ జిల్లా బద్వేల్ ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగిన డాక్టర్ రాజశేఖర్ ….పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన బద్వేల్లో పరాజయం తప్పదని భావించిన ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తను పోటీలో ఉండటం లేదని.. టికెట్ కోసమని తను చెల్లించిన డబ్బులను ఇప్పుడు వెనక్కు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారట. తను మూడుకోట్ల రూపాయల మొత్తాన్ని అధిష్టాన వర్గానికి చెల్లించినట్టుగా, ఆ డబ్బులను ఇప్పుడు వెనుక్కు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంట.
మరోవైపు టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ విజయజ్యోతి శుక్రవారం టీడీపీ రెబల్గా నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. దీంతో తన ఓటమి ఖాయమని నిర్థారించుకున్న రాజశేఖర్ నిన్న తన కుటుంబసభ్యులతో సమావేశం అయ్యారు. ఎన్నికల బరిలో నుంచి తప్పుకునే అంశంపై చర్చించారు. టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం బద్వేల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనే సమయంలో రాజశేఖర్ ఉదంతం ఆ పార్టీలో కలకలం రేపుతోంది.