నిండా మూడు నెలలు కూడా నిండని పసిగుడ్డు ప్రభుత్వం ఏపీలో కొనసాగుతోంది. కొత్తగా ముఖ్యమంత్రి అయిన జగన్ ఓనమాలు దిద్దుకుంటూ వెళుతున్నారు. అప్పుడు ప్రతిపక్ష చంద్రబాబు.. ఆయనకు పోటీగా బీజేపీ జగన్ పై యుద్ధానికి రెడీ కావడం విస్మయం కలిగిస్తోంది.
మొన్నటికి మొన్న చంద్రబాబు ‘చలో ఆత్మకూరు’ అంటూ రెచ్చగొట్టాడు. పోలీసులతో ఆయనను హౌజ్ అరెస్ట్ చేసి జగన్ సర్కారు కఠినంగా వ్యవహించింది. ఇప్పుడు జగన్ 100 రోజుల పాలన వైఫల్యం అంటూ బీజేపీ గుంటూరు జిల్లా గురజాలలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. కన్నా లక్ష్మీనారాయణ ఈ పోరుబాటకు రెడీ అయ్యారు. ఇప్పుడు కూడా జగన్ సర్కారు వెనక్కి తగ్గడం లేదు.
అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు జగన్ సర్కారు తిరుగులేని రీతిలో షాక్ ఇచ్చింది. ప్రతిపక్ష టీడీపీనే కాదు.. బీజేపీని వదలనని జగన్ తాజా చర్యలతో నిరూపించుకున్నారు.
గురజాల బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ మేరకు కన్నాకు నోటీసులు అందజేయగా ఆయన తీసుకోవడానికి నిరాకరించారు. గురజాల బహిరంగ సభకు వెళుతున్న కన్నా లక్ష్మీనారాయణను పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు.
ఇలా మూడు నెలలకే వైసీపీ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్న బీజేపీని కూడా జగన్ వదిలేలా కనిపించడం లేదు. కేంద్రంలో మోడీషాలతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్న జగన్ తనకు పోటీగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేస్తే మాత్రం బీజేపీని వదలనని కన్నా నిర్భంధంతో తాజాగా స్పష్టమైన సంకేతాలు పంపించారు.