తెలంగాణాలో టీడీపీ చావుదెబ్బ తిన్నాచంద్రబాబునాయుడిలో మాత్రం ఇసుకంత మార్పు రాలేదని మరో సారి నిరూపించకున్నారు. పాడిందే పాడరా పాచిపల్లదాసరయ్య అన్నట్లు మాట్లాడుతున్నారు. తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికలపై విచిత్రంగా సెలవిచ్చారు బాబుగారు.
తెలంగాణాలో కాంగ్రెస్తో జతకట్టి కూటమిపేరుతో ఎన్నికలకు వెళ్లారు. ఎన్నికల్లో ప్రజలు కూటమిని చావు దెబ్బ కొట్టారు. ఇక టీడీపీని 40 అడుగుల గోతిలో పాతి పెట్టారు. దాని గురించి బాబు ఎలాంటి వ్యాఖ్యలు చేయరు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ వంటి మూడు రాష్ట్రాల్లో బీజేపీ చిత్తుచిత్తుగా ఓడిందంటే టీడీపీ వాళ్ల కృషి కూడా ఉందని చంద్రబాబు చెప్పారు. టీడీపీ పుట్టింది తెలంగాణలోనే అని, ఆయన కూడా మన పార్టీలో ఉన్నవారేనని కేసీఆర్ను ఉద్దేశించి చెప్పారు. అసలు మూడు రాష్ట్రాల్లో భాజాపా ఓటమికి…టీడీపీకీ ఏమన్నా సంబంధం ఉందా..?
ఆ రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు ఏమన్నా ప్రచారం చేశారా. తెలంగాణ ఎన్నికల్లో తాను పనిచేయడం తప్పు అన్నట్టుగా ‘బర్త్ డే గిఫ్ట్..’ అంటూ కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అదే తెలంగాణాలో కూటమి అధికారంలోకి వచ్చింటే దానికి కారణం నేనే అని సొంత డబ్బా కొట్టుకొనే వారు. కాని ప్రజలు కొట్టిన దెబ్బకు బాబు మైండ్ బ్లాక్ అయ్యిందనే చెప్పాలి.
మరో వైపు తన చేతగాని తనాన్ని ప్రతిపక్షాలపైకి నెట్టడం బాబుకు అలవాటుగా మారింది. మనపైకి జగన్, పవన్, కేసీఆర్ లను మోదీ ఎగదోస్తున్నారంటూ కొత్త పల్లవి అందుకున్నారు. లాలూచీ రాజకీయాలు చేసే వారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అన్నారు. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదాను టీఆర్ఎస్ వ్యతిరేకించిందని, ఇటువంటి పార్టీని పవన్, జగన్ లు ఎలా సమర్థిస్తారు? అని నిప్పులు చెరిగారు. మోదీ దయాదాక్షిణ్యాలు అవసరమైనందునే విభజన హామీలపై జగన్ ప్రశ్నించరని విమర్శించారు.