రెండోసారి అఖండ మెజార్టీ సాధించాక మోడీ వెనుదిరిగి చూడడం లేదు. తమతోపాటు కలిసి నడిచిన జేడీయూ అధినేత నితీష్ కుమార్ అలిగినా ఖాతరు చేయలేదు. ఇక కేంద్ర మంత్రుల పోస్టుల్లో మిత్రపక్షం శివసేన బేరం చేసినా మోడీ బెట్టు వీడలేదు. ఎవ్వరి ఒత్తిళ్లకు లొంగకుండా సర్వస్వతంత్రంగా వ్యవహరిస్తూ కేసీఆర్ లాంటి మిత్రులను కూడా దగ్గరకు రానీయకుండా మోడీ కాలం వెల్లదీస్తున్నారు.
అయితే అనూహ్యంగా ఏపీ సీఎం జగన్ ఆహ్వానాన్ని మన్నించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల్లో గెలిచాక బిల్లుల ఆమోదం.. సంస్కరణల బాట పట్టిన మోడీ ఇంతవరకు అధికారికంగా ఏ పథకం, ప్రారంభోత్సవాలను నిర్వహించలేదు. ఇప్పుడు తొలిసారి జగన్ అభ్యర్థన మేరకు ఏపీకి వస్తున్నారు.
ఏపీలో గెలిచాక జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసి వచ్చారు. అందులో భాగంగానే రైతు భరోసా కింద రైతుకు ఏడాదికి రూ.12500 పెట్టుబడి సాయం కింద అందించే పథకం ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీని ఆహ్వానించారు జగన్. ఈ మేరకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి అక్టోబర్ 15న ప్రధాని మోడీ ఏపీకి వస్తున్నారు. ఈ మేరకు పర్యటన ఖరారు అయ్యింది. దీంతో ఏపీ సీఎం జగన్, ప్రధాని మోడీ మధ్య బంధం బలపడినట్టేనని చెప్పకతప్పదు.
ఇక ఆగస్టు 15న గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థను సీఎం జగన్ విజయవాడలో ప్రారంభిస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులు రాష్ట్రవ్యాప్తంగా దీన్ని ప్రారంభించనున్నారు. ఇక సీఎం జగన్ వచ్చే నెల నుంచి జిల్లాల పర్యటనను పెట్టుకోవడం విశేషం.