తన కేబినెట్ రూపకల్పన విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే కసరత్తును పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. అనేక వర్గాల రాజకీయ సమీకరణాలు బేరీజు వేసుకొని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశారని సమాచారం. అటు ప్రభుత్వ పరమైన పాలన లెక్కలు, ఇటు సామాజిక సమీకరణాలను లెక్కలోకి తీసుకుని సీఎం జగన్ తన కేబినెట్ ను రూపొందించారని సమాచారం.
ఇదలా ఉంటె మంత్రి వర్గంపై ఇప్పటి వరకు ఏసీఎం తీసుకోని సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపు 25 మందితో పూర్తిస్థాయి మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఐదుగురు డిప్యూటీ సీఎంలుగా ఉండనున్నారు. దేశం యావత్తూ ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు వర్గాల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసి డిప్యూటీ సీఎంలుగా నియమిస్తానని ఈ ఉదయం జరిగిన పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో జగన్ ప్రకటించారు.
చంద్రబాబునాయుడు తన మంత్రివర్గంలో ఇద్దరికి మాత్రమే డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన కేఈ కృష్ణమూర్తికి, కాపు సామాజిక వర్గానికి చెందిన నిమ్మకాయల చినరాజప్పకు డిప్యూటీ సీఎం పదవులు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. అయితే జగన్ ఈసారి అలాంటి పొరపాటు చేయకుండా మంత్రవర్గంపై నిర్ణయం తీసుకున్నారు.
రెండున్నరేళ్ల తరువాత కేబినెట్ లో మార్పలు ఉంటాయని, అప్పుడు కొత్త మంత్రులు వస్తారని ఆయన అన్నారు. ఈ రెండున్నరేళ్లూ మంత్రుల పనితీరును తాను గమనిస్తుంటానని, సంక్షేమం అమలు, అభివృద్ధిలో నిర్లక్ష్యం చూపిన వారికి పదవులు దూరమవుతాయని హెచ్చరించారు.శనివారం నాడు 25 మంది మంత్రులతో పూర్తిస్థాయిలో క్యాబినెట్ ఏర్పాటవుతుందని జగన్ స్పష్టం చేశారు. మొత్తం మంత్రుల్లో సగం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉంటారని అన్నారు.