అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్ కొనుగోళ్లపై అధికార, ప్రతిపక్ష మటలతూటాలతో సభ దద్దరిల్లింది. టీడీపీ హయాంలో రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉన్నా అధిక ధరకు విండ్, సోలార్ పవర్ను కొనుగోలు చేసిందని సీఎం జగన్ ధ్వజమెత్తారు. విద్యుత్ కొనుగోళ్లుపై గత ప్రభుత్వ విధానాలను ఆధారాలతో సహా ఎండగట్టారు. ముందుగా విద్యుత్ కొనుగోళ్లపై ప్రతిపక్షనేత బాబు మాట్లాడిన తర్వాత జగన్ ఘాటుగా సమాధనం ఇచ్చారు. స్క్రీన్స్ మీద బాబుకు చుక్కలు చూపించారు.
అవసరం లేకున్నా కొందరికి ప్రయోజనం కల్గించేందుకు చంద్రబాబునాయుడు సర్కార్ అప్పట్లో విద్యుత్ను కొనుగోలు చేసిందని ఆయన ఆరోపించారు. బాబు నిర్వాకం వల్ల గత మూడేళ్ల నుండి ఏపీ ప్రభుత్వం రూ. 2635 కోట్లను అధికంగా చెల్లించందని జగన్ గుర్తు చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే టీడీపీ సర్కారు హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)పై సమీక్షించేందుకు కమిటీ వేశామన్నారు.
2015-16లో ఆర్పీఓ 5 శాతం నిర్ణయిస్తే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 5.5 శాతం కొనుగోలు చేసింది. 2016-17లో ఆర్పీఓ అయిదు శాతం నిర్ణయించగా, 8.6 శాతం కొనుగోలు చేసింది. ఇక 2017-18లో ఆర్పీఓ 11శాతం నిర్ణయిస్తే 23.4శాతం కొనుగోలు చేసింది. దీంతో 2016-17లో రూ.430 కోట్లు, 2017-18లో రూ.924.9 కోట్లు, 2018-19లో రూ.1292.8 కోట్లు ప్రభుత్వంపై అదనంగా భారం పడిందన్నారు.
విండ్ పవర్ను యూనిట్కు రూ.4.84కు ఒప్పందం కుదుర్చుకుందని కాని రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ యూనిట్ పవర్ రూ.4.20కి అందుబాటులో ఉందన్నారు. థర్మల్ పవర్ను తీసుకోకపోయినా… యూనిట్కు రూ.1.10 పైసలు చెల్లించాల్సి వచ్చింది. మొత్తంపై యూనిట్ ధర రూ.5.94కు కొనుగోలు చేసినట్లు అయిందన్నారు. సోలార్ విద్యుత్ కొనుగోలు విధానంలో కూడా ఇలాగే వ్యవహరించారు. విండ్ పవర్లో 64 శాతం కొనుగోళ్లు కేవలం ముగ్గురితో జరిగాయని ధ్వజమెత్తారు.
2016-18 మూడేళ్లలో విద్యుత్ అవసరం లేకున్నా రూ.5,497 కోట్ల విద్యుత్ కొనుగోలు చేశారని మండి పడ్డారు. సోలార్, విండ్ పవర్ కొనడం వల్ల కేంద్రంనుంచి ఇన్సెంటీవ్లు వస్తున్నాయని చంద్రబాబు అంటున్నారని కాని ఇప్పటి వరకు వచ్చింది రూ.540కోట్లు మాత్రమేనన్నారు. గత అయిదేళ్లుగా ఏపీ పవర్ సర్ప్లస్ రాష్ట్రంగా ఉంది. మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎందుకు విద్యుత్ కొనుగోళ్లు చేశారని బాబు ప్రశ్నించారు సీఎం జగన్.