తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దూకుడు రోజు రోజు ఎక్కువవుతున్న నేపథ్యంలో నేడు బండి సంజయ్ అరెస్ట్ కావడం సంచలనం రేకెత్తిస్తుంది. రాష్ట్రం లో బీజేపీ అధ్యక్షుడు గా అయిన తర్వాత అయన పార్టీ ని బలోపేతం చేయాలనే దిశగా చాల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.. కాగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అసెంబ్లీ ముట్టడికి వెళ్తుండగా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది.
సంజయ్ ను తరలిస్తోన్న వాహనాన్ని ముందుకు వెళ్లనివ్వకుండా దానికి అడ్డంగా బీజేపీ కార్యకర్తలు పడుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. చివరకు సంజయ్ ను పోలీసులు గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
కాగా, ఈ విషయంపై బండి సంజయ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. “తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఛలో అసెంబ్లీ కార్యక్రమం విజయవంతం. ఎన్ని నిర్బంధాలు విధించినా కార్యకర్తలు ఛేదించుకొని అసెంబ్లీ ముట్టడిలో పాల్గొన్నారు” అని ఆయన ట్వీట్ చేశారు.