ఏపీ పర్యటనలో అమిత్ షా టీడీపీనిప్పులు చెరిగారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా విజయనగరం వచ్చిన అమిత్ షా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి నేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంటే…బాబు మాత్రం సహకరించట్లేదని దుష్ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. 2014 నుంచి ఇప్పటివరకూ బీజేపీ ప్రభుత్వం ఏపీకి రూ. 5.56 లక్షల కోట్ల నిధులను కేంద్రం ఇచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా పేదవారికి 2 కోట్ల ఇళ్లను కేంద్రం మంజూరు చేస్తే.. అందులో 10 లక్షల ఇండ్లను ఏపీకే కేటాయించిందని గుర్తు చేశారు.
ప్రత్యేక హోదా విషయంలో బాబు యూటర్న్ తీసుకున్నారని మండి పడ్డారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినపుడు మోదీని పొగిడిన బాబు ఇప్పుడు భాజాపాపై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి ఇచ్చిన 14 హామీల్లో ఇప్పటికే 10 అమలు చేశామని చెప్పారు. 20 జాతీయ స్థాయి సంస్థలను ఏపీలో నెలకొల్పామన్నారు. దీనిపై చంద్రబాబు చర్చకు సిద్ధమా? అని అమిత్ షా సవాల్ విసిరారు.
ఏపీ కోసం ప్రత్యేక హోదాకు మించి నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినా.. చంద్రబాబు సరైన ప్రణాళికతో ముందుకు రాలేదని అమిత్ షా ఆరోపించారు. మహిళా నేతలను బెదిరిస్తే భయపడబోమన్నారు.అలాంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు. వైసీపీ, టీడీపీలు అవినీతి పార్టీలేనని విమర్శించారు. వాటికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.