జగన్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలుకూడా కాకముందే విమర్శలు చేయడం మొదలు పెట్టారు ప్రతిపక్ష పార్టీలు. టీడీపీ విమర్శించినా దానికి ఒక అర్థం ఉంటుంది. కాని భాజాపా మాత్రం విమర్శించడంలో అర్థమేలేదు. ఆ పార్టీకి కనీసం ఒక్క ఎమ్మెల్యేకూడా లేరు. కాని పార్టీలోని ఇద్దరు అగ్రనేతలు జగన్ ను ఇప్పుడే టార్గెట్ చేయడం మొదలు పెట్టారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భాజాపా విశ్వప్రయత్నాలు చేస్తోంది. సొంతంగా ఎదిగే అవకాశం లేకపోవడంతో వలసలతో ఎదగాలని చూస్తోంది. భారీగా ఇతర పార్టీల్లోని నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటోంది.ఏపీ ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న టీడీపీని మరింత దెబ్బతీయడానికి కాషాయ పార్టీ పావులు కదుపుతోంది.టీడీపీకి చెందిన మాజీలతోపాటు తాజాలను కూడా తమ పార్టీలోకి లాగేందుకు ప్రయత్నిస్తోంది. ఆవిషయంలో భాజాపా కొంత విజయం సాధించింది.
అయితే జగన్ను టార్గెట్ చేయడం ఆసక్తికరంగా మారింది. రెండు రోజుల కిందట బీజేపీ నేత పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలు కూడా ఇందు నిదర్శనం. విశాఖలో కేవలం చర్చిలకు మాత్రమే భద్రత కల్పిస్తూ ఆదేశాలివ్వడం సరికాదని అలాంటి తప్పులు చేయవద్దని హితవుపలికారు.
ఇక ఆపార్టీ అధ్యక్షుడు కన్నా కూడా జగన్ పాలన సైతం టీడీపీని తలపిస్తోందని వ్యాఖ్యానించారు. టీడీపీ అరాచక, అవినీతి పాలనతో విసిగిపోయిన ప్రజలు వైసీపీకి అధికారం ఇస్తే వారి పాలన కూడా అదే రీతిలో సాగుతోందని విమర్శించారు. ప్రతి చోట పోలీసుల రాజ్యం నడుస్తోందని కన్నా ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో గ్రామ, మండల స్థాయిల్లో ఇతర పార్టీల కార్యకర్తలు, నేతలపై పోలీసులు రౌడీ షీట్లు తెరుస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం కూడా తమ తీరు మార్చుకోవాలని పురందేశ్వరి. కన్నా చేసిన వ్యాఖ్యలు చూస్తే జగన్కు భవిష్యత్తులో చిక్కులు తప్పవనే వాదన వినిపిస్తోంది.