ఎన్నికల వేళ టీడీపీలో అసమ్మతి ఉన్నా బాబు మాత్రం అభ్యర్తుల ఎంపికలో ముందున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చేందుకు సిద్దమయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పార్టీ తరుపున అభ్యర్తులను ప్రకటిస్తున్న బాబు ఈ సారి మాత్రం తన రూట్ను మార్చారు. ముందస్తు ఎన్నికల్లో తెలంగాణా సీఎం కేసీఆర్ రూట్ లోనే వెల్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్తులను ప్రకటించనున్నారు.
కడప జిల్లాలో వైసీపీకి చెక్ పెట్టాలని చూస్తున్న బాబు ముందుగా కడం అభ్యర్తుల ఎంపికపై దృష్టిసారించారు. ఇప్పటికే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 80 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ఫైనలైజ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మెుదటి నుంచి కడప జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించిన చంద్రబాబు జిల్లాలో దాదాపు అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
కడప పార్లమెంట్ అభ్యర్ధిగా మంత్రి ఆదినారాయణ రెడ్డిని ఫైనలైజ్ చేశారు. ఇకపోతే అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే పులివెందుల నుంచి సతీష్ రెడ్డి, జమ్మల మడుగు నుంచి రామసుబ్బారెడ్డిని ఇప్పటికే ఫైనలైజ్ చేశారు. అలాగే రాయచోటి నుంచి రమేష్కుమార్రెడ్డి, రాజంపేట నుంచి బత్యాల చెంగల్రాయుడు, రైల్వేకోడూరు నుంచి టి.నరసింహప్రసాద్(చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అల్లుడు )ను ఎమ్మెల్యేలుగా బరిలో దింపాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు సమాచారం.
మైదుకూరు నుంచి మాజీ మంత్రి డీఎల్, ప్రొద్దుటూరు నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ను పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని బాబు ఆలోచిస్తున్నారంట. కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి అహ్మదుల్లా తనయుడు అష్రఫ్కు అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది. కమలాపురం సీటు విషయానికి వస్తే పుత్తా నరసింహారెడ్డి, వీరశివారెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
బద్వేల్ అసెంబ్లీ విషయానికి వస్తే లాజరస్ పేరును పరిశీలిస్తున్నారు. లాజరస్ ను మాజీఎమ్మెల్యే విజయమ్మ తెరపైకి తీసుకువచ్చారు. అభ్యర్తులపై జిల్లా టీడీపీ నేతలతో చర్చించినట్లు సమాచారం. గురువారం సమావేశంలో రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక కూడా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అన్ని కుదరితే రెండు మూడు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.