సార్వత్రిక ఎన్నికల సీజన్ దగ్గర పడటంతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన నేతలకు బాబు చుక్కలు చూపిస్తున్నారు. అసెంబ్లీ సీట్లు పెరగవని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. దీంతో ఫిరాయింపు నేతలను తన కంట్రోల్లో పెట్టుకుంటున్నారు. తాజాగా మంత్రి అఖిల ప్రియకు డబుల్ షాక్ ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా కర్నూలు జిల్లాలోని అఖిల ముఖ్య అనుచరులు, ఆమె వర్గీయుల ఇళ్లలో పోలీస్ అధికారులు సోదాలు నిర్వహించడం జిల్లా రాజకీయాల్లో కలకలం రేపుతోంది. బుధ వారం అర్థరాత్రి పోలీసులు వివిధ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల ఇళ్లతో తనిఖీలు చేపట్టారు. అయితే ఈ తనిఖీలు మంత్రి అఖిల ప్రియకు అత్యంత సన్నిహితంగా వుండే నాయకుల ఇళ్లలో కూడా జరిగాయి. దీంతో అఖిల పోలీసుల తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
అధికారుల చర్యలకు నిరసనగా తన గన్మెన్లను వెనక్కి పంపి నిరసన తెలిపారు. తన పర్యటనలో భద్రత కోసం వస్తున్న పోలీసులను రావొద్దని చెప్పేశారు. ఎవరి ఆదేశాలతో తనిఖీలు చేపట్టారని అధికారులను అఖిల ప్రశ్నించడంతో ఖంగుతిన్న అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాలతోనే తనిఖీలు చేపట్టామని తెలిపారంట.
ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయంపుల్లో కూడా భూమా కుంటుంబానికి షాక్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం నంద్యాల, ఆళ్లగడ్డ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా భూమా బ్రహ్మానందరెడ్డి, అఖిల ప్రియలు ఉన్నారు. వారిలో ఇద్దరిలో ఒకరికి మాత్రమే టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం.
నంద్యాల అసెంబ్లీ టికెట్కు కోసం పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. ఆపార్టీ ఎంపీ ఎస్పీవై రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి నంద్యాల టికెట్ తన అల్లుడికే వస్తుందని బహిరంగంగా ప్రకటించారు. ఈ పరిస్థితుల నేపధ్యలో బాబు అటు అఖిలప్రియను, ఇటు బ్రహ్మానందరెడ్డిని టికెట్ విషయంలో పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. మరో వైపు అఖిల తీరు కూడా బాబుకు విసుగు తెప్పిస్తోంది. జిల్లా కు చెందిన సీనియర్ నాయకులను అఖిల కలపుకొని పోవడంలేదన్నది తెలిసిందే. భూమా అన్నాచెల్లెళ్లలో ఎవరికో ఒకరికి బాబు హ్యాండిస్తాడని కర్నూలు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.