అసెంబ్లీలో బడ్జెట్టపై చర్చ జరుగుతోన్న సమయంలో కాపు రిజర్వేషన్ల అంశంతో సభ దద్దరిల్లింది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో మాటలయుద్ధం జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు బడ్జెట్ ప్రసంగం సమయంలో కాపుల రిజర్వేషన్లు, నిధుల కేటాయింపు, తుని ఘటనపై ప్రస్తావన వచ్చింది. అంబటి చేసిన వ్యాఖ్యలకు చినరాజప్ప కౌంటరిచ్చారు.. కేంద్రం ఇచ్చిన ఈబీసీ 10శాతం రిజర్వేషన్లలో తాము 5శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు.
అయితే దీనిపై వైసీపీ సభ్యుడు దాడిశెట్టి రాజా అభ్యంతరం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు 5శాతం గురించి పక్కన పెడితే.. అసలు కాపులు ఓసీల్లో ఉన్నారా.. బీసీల్లో ఉన్నారా చెప్పాలని చంద్రబాబును ప్రశ్నించారు. కాపుల్ని బీసీల్లో చేర్చే అంశంపై మంజునాథన్ కమిషన్ వేశామని.. కమిషన్ రిపోర్ట్ మేరకు చట్టం చేసి కేంద్రానికి పంపామన్నారు. బాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు అంబటి. కమిషన్ రిపోర్ట్పై ఛైర్మన్ సంతకం లేకుండా ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. దీంతో ఇరు సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది.
మరో సారి స్పందించిన బాబు కాపు రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం తమ విధానం చెప్పకుండా.. తనను విమర్శించడం సరికాదన్నారు. తాము ఐదు శాతం రిజర్వేషన్ల అంశాన్ని ప్రాసెస్ చేశాం.. దీనిపై తమ విధానం ఏంటో చెప్పాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు డిమాండ్ చేశారు. దీంతో సీన్లోకి సీఎం వైఎస్ జగన్ ఎంట్రీ ఇచ్చారు. చంద్రబాబును చూస్తే సినిమాల్లో విలన్ క్యారెక్టర్ గుర్తొస్తొందంటూ వ్యాఖ్యానించారు.
జగన్ కామెంట్లుపై టీడీపీ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో.. అచ్చెన్నాయుడుకు సైజ్ అయితే ఉంది కానీ బుర్ర పెరగలేదంటూ సీఎం జగన్ మరోసారి కామెంట్ చేశారు. అచ్చెన్నాయుడుకు తలలో ఉండాల్సిన మెదడు అరికాల్లో ఉందని వ్యాఖ్యానించిన జగన్.. కాపులను చంద్రబాబు అడ్డగోలుగా వ్యతిరేకించారు కాబట్టే ప్రతిపక్షంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. మ్యానెఫెస్టోలో ఇచ్చిన విధంగా కాపులకు నిధులను బడ్జెట్లో కేటాయిస్తున్నామన్నారు.