అత్యున్నత స్థానాల్లో ఉన్నవారు బయటకు ఎన్ని మాటలు చెప్పిన వాళ్లే ముందు అప్రమత్తంగా ఉంటారు. ఎప్పుడు ఏం అవుతుందన్న ఆలోచనలు వాళ్లలో మెదులుతూనే ఉంటాయి కాబట్టి అందుకు జాగ్రత్తలు తీసుకుంటారు. అర్దం లేని సెంటిమెంట్లను చాలా గుడ్డిగా ఫాలో అవుతారు.
అయితే ఇలాంటివి తాను అసలు పట్టించుకోన్నట్లుగా వ్యవహరించి.. తనకున్న దైర్యంతో ముందుకు నడిచాడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సీఎం పదవిలో ఉన్న ఎవరైన వైజాగ్ లోని కేజీహెచ్ హాస్పిటల్ ను సందర్శించరు. అందుకు కారణం ఉంది. అప్పుడెప్పుడో ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్.. తన వైజాగ్ పర్యటనలో కేజీహెచ్ ను సందర్శించటం.. తర్వాత ఆయన పదవి పోవటంతో.. అది సెంటిమెంట్ గా మారింది. ఎన్టీఆర్ తర్వాత ఎంతో మంది సీఎంలు అయ్యారు. రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత సీఎం బాధ్యతలు తీసుకున్న రెండో ముఖ్యమంత్రిగా జగన్ నిలిచారు.
ఇలా ఎందరో చేయలేని సాహసాన్ని తాజాగా జగన్ చేశారు. కేజీహెచ్ కు వెళ్తే పదవి పోతుందన్న భయానికి భిన్నంగా.. విశాఖలో తాజాగా నెలకొన్న కెమికల్ లీక్ ఉదంతంలోని బాధితుల్ని పరామర్శించేందుకు ఆసుపత్రికి స్వయంగా వెళ్లారు. దాంతో ఎన్టీఆర్ తర్వాత కేజీహెచ్ కు వెళ్లిన తొలి ముఖ్యమంత్రి జగన్ మాత్రమే కావటం గమనార్హం. సెంటిమెంట్ లు పక్కనపెట్టి.. ప్రజాసంక్షేమంలో తనకు ప్రజలు మాత్రమే ముఖ్యం కానీ.. అర్దం లేని సెంటిమెంట్లను నమ్మడని తన తీరుతో స్పష్టం చేశారు సీఎం జగన్.