తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. రేవంత్ రెడ్డి మిత్రుడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి కారెక్కేందుకు సిద్దమయ్యారు. గత రెండు రోజులుగా టీఆర్ఎస్లో చేరుతున్నారనే వార్తలను ఒంటేరు ధృవీకరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం మేరకు తాను తెరాసలో చేరుతున్నట్లు ఆయన ఇవాళ ప్రకటించారు.
పదవులు, డబ్బుల కోసం తాను ఏనాడూ కూడ ఆలోచించలేదన్నారు. 15 ఏళ్లుగా తన వెంటనే తన క్యాడర్ ఉందన్నారు. తాను టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరిన సమయంలో కూడ ఒక్క మాట కూడ మాట్లాడకుండా టీడీపీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆయన గుర్తు చేసుకొన్నారు. టీఆర్ఎస్లో చేరుతున్నానని ఇప్పుడు కూడా క్యాడర్ నావెంటే ఉందన్నారు.
రైతు బంధుతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజలు మద్దతుగా నిలిచారని ప్రతాప్ రెడ్డి అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన సంక్షేమ పథకాలతో ఓటర్లతో ఏక పక్షంగా తీర్పు ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
గజ్వేల్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు పోటీ చేసిన వంటేరు రెండో స్థానంతోనే సరిపెట్టుకున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన తెరాస నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.