దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అంటే రాజకీయాల్లో ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన మాట్లాడితే సెన్సేషన్.. బరిలో దిగితే వైబ్రేషన్.. అసలు బరితెగించడంలో ఆయనకు ఆయనే సాటి అంటే నమ్మాల్సిందే. ఆయన అసలు ఏదైనా మాట్లాడేప్పుడు అసలు ఆలోచిస్తారో ఆలోచించరో అనేది ఓ ధర్మ సందేహం. ఎందుకో తెలీదు కానీ.. ఆయనకు దళితులు అంటే ఎప్పుడు చిన్నచూపే. మరి తమ అధినేత చంద్రబాబే ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? అన్నప్పుడు తాను మాత్రం వారిని అక్కున చేర్చుకుంటే ఏం బాగుంటుంది అనుకున్నారేమో.. వారిని దూషిస్తూ.. వేధిస్తూ కాలం గడిపేస్తుంటారు. ఎమ్మార్వో వనజాక్షిపై దాడి.. ఇసుక అక్రమరవాణాకు అడ్డుపడుతున్నారనే నెపంతో మరికొందరిపై అనుచరులతో దాడులు.. పలువురు ఎస్సీ యువకులను దాడులు.. ఇలా చెప్పుకుంటు పోతే ఆయన ట్రాక్ రికార్డ్ పెద్దదనే చెప్పాలి.
ఇక ఈ సారి ఓ అడుగు ముందుకు వేశారు చింతమనేని. ఏకంగా దళితులకు రాజకీయాలు అవసరమా? రాజకీయాలు మేము చేసుకుంటాం. మీరు అలా పడి ఉండండిరా అంటూ ఆ తర్వాత అచ్చతెలుగులో ఓ బూతు.. ఇలా సాగింది ఆయన ఉపన్యాసం. ఇదేదో స్టింగ్ ఆపరేషన్ చేసి కనుకొన్న విషయాలు కావు.. పబ్లిక్గా అందరు చూస్తుండగా మైక్ పట్టుకొని చేసిన వ్యాఖ్యలు.
ఇలా ఇంత పబ్లిక్గా దళితులను కించపరిచినా కానీ చింతమనేనిపై చర్యలు తీసుకునే ధైర్యం లేదనే చెప్పాలి. కారణం ఆయన వెనుక పెదబాబు.. చినబాబు ఉన్నారు కాబట్టే అంటున్నాయి దళిత సంఘాలు. ఆనాడు వనజాక్షిపై దాడి చేసినప్పుడే చర్యలు తీసుకుంటే విషయం ఇక్కడివరకు వచ్చేది కాదు కదా అంటూ ప్రశ్నిస్తున్నారు. అధికారం చేజిక్కుంచుకోవడానికి మాత్రం తమ ఓట్లు కావాలి కానీ.. తమకు రాజ్యాధికారం మాత్రం దక్కే వీలు లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి 70 ఏళ్లు గడిచినా అగ్రవర్ణాల ఆధిపత్య ధోరణి పోలేదనడానికి టీడీపీ నేతల వ్యాఖ్యలే కారణమంటున్నారు.